సీఎం ఔట్ ? రూ. 6 కోట్ల కొత్త నోట్లు, 7కిలోల బంగారం
పెద్ద నోట్ల రద్దుపై గత కొన్ని రోజుల నుంచి పార్లమెంట్ లో పదేపదే ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గొంతులో ఇప్పుడు పచ్చి వెలక్కాయపడినట్లు అయ్యింది.
బెంగళూరు: కొత్త నోట్లు చిక్కక సామాన్య ప్రజలు గంటల పాటు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడి నానాపాట్లు పడుతుంటే ప్రభుత్వ అధికారులు మాత్రం కొత్తగా ముద్రించిన కొన్ని కోట్ల రూపాయల కట్టలను ఇంటిలో దాచి పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా జల్సాలు చేస్తున్నారు.
ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. కేవలం బెంగళూరు నగరంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సన్నిహితుల దగ్గర ఈ నగదు బయటపడటంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది.
ఆదాయ పన్ను శాఖ అధికారులు పలు బృందాలుగా విడిపోయి బెంగళూరు, చెన్నై, ఈరోడ్ తదితర ప్రాంతాల్లో వేకువ జామున నుంచి దాడులు మొదలు పెట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడైన కావేరీ జలమండలి చీఫ్ ఇంజనీరు చిక్కరామయ్య, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్ర (బెంగళూరు) ఇండ్లు, నివాసాల్లో సోదాలు చేశారు.
అదే విధంగా ఇద్దరు కాంట్రాక్టర్లు చక్రవర్తి, నజీర్ నివాసాల్లో సోదాలు చేసిన అధికారులు షాక్ కు గురైనారు. సోదాల్లో ఏకంగా వారి దగ్గర రూ. 6 కోట్లు బయటపడ్డాయి. అందులో రిజర్వు బ్యాంకు ఇటీవల ముద్రించిన కొత్త రెండు వేల రూపాయల నోట్లు రూ. 4.70 కోట్లు బయటపడ్డాయి.
ఐఏఎస్, బ్యాంక్ మేనేజర్ హడల్: ఐటీ దాడులు
రూ. 2,000 నోట్ల 235 కట్టలు బయటపడటంతో అధికారులు హడలిపోయారు. ఈ దాడుల్లో ఏకంగా దాదాపు 7 కిలోల బంగారు బిస్కెట్లు, నగలు బయటపడ్డాయి. పలు ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
అధికారులు, కాంట్రాక్టర్లకు చెందిన బ్యాంకు లాకర్లు, పలు ఆస్తుల కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మా సోదాల్లో రూ. కోట్ల విలువైన కొత్త కరెన్సీ బయటపడిందని, ఇంకా దాడులు కొనసాగుతున్నాయని ఐటీ అధికారులు మీడియాకు చెప్పారు.
బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదు బయటకు రావడం సాధ్యం కాదని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకుల మీద తాము నిఘా వేశాయని అధికారులు చెప్పారు.
పాత పెద్ద నోట్ల రద్దుపై గత కొన్ని రోజుల నుంచి పార్లమెంట్ లో పదేపదే ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లు అయ్యింది. ఇప్పుడు సీఎం సిద్దరామయ్య ఎలా స్పంధిస్తారు అని కర్ణాటక బీజేపీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.