భారీ వర్షాలు: విరిగి కూలిన బ్రిడ్జి, లారీ గల్లంతు
సిమ్లా: భారీ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. వరదల కారణంగా ప్రజలు నిరాశ్రయులవుతుండగా, రవాణా మార్గాలు వరదలో మునిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా, హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆ ప్రవాహ వేగానికి బెయిలీ బ్రిడ్జి ఒకటి మధ్యలో విరిగి కూలిపోయింది.
రోహ్టంగ్ టన్నెల్ ప్రాజెక్టుకు నిర్మాణ సామగ్రి తరలించడం కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి మీద లారీ వెళ్తుండగా కూలిపోయింది. డ్రైవర్ను వెంటనే రక్షించారు. బెయిలీ బ్రిడ్జి ఉన్నట్టుండి కూలిపోయింది గానీ, ఇందులో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రోహ్తంగ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బ్రిగెడియర్ డీఎన్ భట్ తెలిపారు.
Shimla,Himachal Pradesh: Part of supply bridge for Rohtang tunnel project washes away due to floods in river Chandra pic.twitter.com/UUnKpzk37t
— ANI (@ANI_news) 29 August 2016
రాబోయే నాలుగైదు రోజుల్లో బ్రిడ్జిని పునరుద్ధరిస్తామని, కొట్టుకుపోయిన లారీని కూడా బయటకు తీస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు రావడంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కాగా, లెహ-మనాలి మార్గంలో ఉన్న రోహ్తంగ్ పాస్ వద్ద తలపెట్టిన 8.8 కిలోమీటర్ల రోహ్తంగ్ సొరంగం దేశంలోనే అతి పొడవైన సొరంగం అవుతుంది. మంచు కారణంగా ఆరు నెలల పాటు రోహ్తంగ్ పాస్ను మూసేస్తారు. సొరంగం నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా రోహ్తంగ్ పాస్ మార్గాన్ని తెరిచే ఉంచేందుకు అవకాశం ఏర్పడనుంది.