లోకాయుక్త రూ. కోటి లంచం కేసు: భాస్కర్ అరెస్టు
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త లో రూ. కోటి లంచం డిమాండ్ చేసిన కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు (ఎస్ఐటి) మరొ వ్యక్తిని అరెస్టు చేశారు. లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ కు పర్సనల్ సెక్రటరిగా చెప్పుకుని తిరిగిన వి. భాస్కర్ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేశారు.
గురువారం భాస్కర్ ను లోకాయుక్త కోర్టు ముందు హాజరు పరుస్తామని ప్రత్యేక బృందం అధికారులు తెలిపారు. అయితే వి. భాస్కర్ ను కర్ణాటకలో అరెస్టు చేశారా, తెలంగాణలో అరెస్టు చేశారా అని మాత్రం అధికారులు వెల్లడించలేదు.
చిత్రదుర్గలో నీటి పారుదల శాఖలో ఇంజనీరుగా పని చేస్తున్న చెన్నబసప్పను లంచం ఇవ్వాలని భాస్కర్ బెదిరించాడు. తాను అశ్విన్ రావ్ పీఏనంటూ చెన్నబసప్పను పరిచయం చేసుకున్నాడు. చెన్న బసప్ప ఫిర్యాదు చెయ్యడంతో కేసును సిట్ అధికారులకు బదిలి చేశారు.
రూ. కోటి లంచం కేసులో అరెస్టు అయిన అశ్విన్ రావ్, అశోక్ కుమార్, శంకర్ గౌడ, శ్రీనివాస్ గౌడలను ఈ నెల 14వ తేది వరకు రిమాండ్ కు తరలించారు. వారి బెయిల్ అర్జీ విచారణ అదే రోజు జరుగనుంది. బుధవారం సయ్యద్ రియాజ్ బెయిల్ అర్జీ విచారణ పూర్తి అయ్యింది.
ఈనెల 14వ తేదిన తీర్పు చెబుతామని న్యాయస్థానం చెప్పింది. సయ్యద్ రియాజ్ ను రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు చేస్తారని సిట్ అధికారులు అంటున్నారు.