గుజరాత్ అల్లర్లు: మాజీ ఐపీఎస్కు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారికి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయ్యింది. తన మీద నమోదు అయిన రెండు ఎఫ్ఐఆర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని ఆయన పెట్టుకున్న పిటీషన్ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ సమర్పించిన పిటీషన్ పరిశీలించిన సుప్రీం కోర్టు కింది కోర్టులో విచారణ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. మాజీ ఐపీఎస్ అధికారి మీద రెండు కేసులు నమోదు అయ్యాయి.
2002 ఫిబ్రవరి 27వ తేదిన గుజరాత్ లోని గోద్రాలో రైలు తగలబడిపోయిన తరువాత అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో సీనియర్ అధికారుల సమావేశం జరిగింది. ఆ గదిలో పోలీసు శాఖలో డ్రైవర్ గా పని చేసే వ్యక్తి ( కానిస్టేబుల్) ఉన్నాడు.
తరువాత రైలు ఘటనకు ప్రతీకారంగా పెల్లుబుకే ప్రజాగ్రహానికి అడ్డుకట్ట వెయ్యరాదని నరేంద్ర మోడీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని పుకార్లు పుట్టాయి. ఆ డ్రైవర్ను ఓ ఐపీఎస్ అధికారి కావాలనే లోపలికి పంపించారని విచారణలో వెలుగు చూసింది.
ఉద్దేశపూర్వకంగా తప్పుడు అఫిడివిట్ రూపొందించడానికి ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ప్రయత్నించారని కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆయన మీద ఓ కేసు నమోదు అయ్యింది. అదే విధంగా నాటి గుజరాత్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ-మెయిల్ హ్యాక్ చేశారని సంజీవ్ భట్ మీద కేసు నమోదు అయ్యింది.
ఈ రెండు కేసులు ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్నాయి. గుజరాత్ ప్రభుత్వం 2015 ఆగస్టు 18వ తేదిన సంజీవ్ భట్ ను సస్పెండ్ చేసింది. తన మీద నమోదు అయిన కేసుల దర్యాప్తు సక్రమంగా జరగలేదని, తనకు న్యాయం జరగాలంటే సిట్ తో దర్యాప్తు చేయించాలని భట్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.