మీ దగ్గర రూ.10 లక్షలు ఉంటే ఐటీ కన్ను మీమీద పడినట్లే..
ఇకమీదట రూ.10 లక్షలు, అంతకుమించిన లావాదేవీల సమాచారాన్ని బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలే నేరుగా ఆదాయపన్ను (ఐటీ) విభాగానికి తెలియజేయాల్సి ఉంటుంది.
ఢిల్లీ: ఇకమీదట డిపాజిట్లుగానీ, క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపులుగానీ, లేదంటే ఇతర ఆస్తి లావాదేవీలుగానీ.. ఏవైనా సరే రూ.10 లక్షలు, అంతకుమించితే.. ఆ సమాచారాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలే నేరుగా ఆదాయపన్ను (ఐటీ) విభాగానికి తెలియజేయాల్సి ఉంటుంది.
సమాచారం పంపడానికి వీలుగా ఆదాయపు పన్ను శాఖ 'ఈ-వేదిక'ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు నిబంధనావళిని పంపించింది. ఇవన్నీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి జరిపే లావాదేవీలకే వర్తిస్తాయి.
* ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తికి చెందిన ఒక బ్యాంకు ఖాతాలోగానీ, లేదా వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న ఖాతాల్లోగానీ (ఎన్ని ఉంటే అన్నీ కలిపి) రూ.10 లక్షలు, అంతకుమించి నగదు జమ అయితే... (ఫిక్సడ్ డిపాజిట్లు, కరెంటు అకౌంట్ లు కాకుండా)
* ఒకరి పేరున రూ.10 లక్షలు, అంతకుమించి ఫిక్సిడ్ డిపాజిట్ చేసినా.. (అప్పటికే ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లను నవీకరణ చేస్తే ఇది వర్తించదు)
* క్రెడిట్ కార్డు బిల్లు కింద రూ.1 లక్ష నగదు చెల్లించినా...
* క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులకు మొత్తం రూ.10 లక్షల మేర చెక్కులు ఇచ్చినా, నగదు బదిలీ చేసినా...
* నోట్ల రద్దు తరువాత నవంబరు 9 నుంచి డిసెంబరు 30 వరకు ఒక వ్యక్తికి చెందిన అన్ని ఖాతాల్లో రూ.2.5 లక్షలకు మించి జమ చేసినా...
* నోట్ల రద్దు తరువాత నవంబరు 9 నుంచి డిసెంబరు 30 వరకు కరంట్ అకౌంట్లలో రూ.12.5 లక్షలు జమ చేసినా...
* గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబరు 9 వరకు ఏ ఖాతాకు సంబంధించినవైనా నివేదించదగిన ఆధారాలు ఉంటే...
* కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థల విషయానికి వస్తే... ఏ వ్యక్తి అయినా రూ.10 లక్షల బాండ్లు, డిపాజిట్ల కొనుగోలు చేసినా...
* 10 లక్షలకు మించి మ్యూచువల్ ఫండ్లు, బైబ్యాక్ షేర్లు తీసుకున్నా...
* రూ.10 లక్షల విదేశీ ద్రవ్యం (ట్రావెలర్ చెక్కు, ఫారెక్స్ కార్డు సహా) కొనుగోలు చేసినా...
* రిజిస్ట్రార్లకు సంబంధించినంత వరకు... రూ.30 లక్షల స్థిరాస్థిని అమ్మినా, కొనుగోలు చేసినా.. ఆ సమాచారం నేరుగా ఆదాయపు పన్ను విభాగానికి పంపించాల్సిందే.