రేప్ చెయ్యడానికి ప్రయత్నించిన స్వామీజీ: మర్మాంగం కత్తిరించిన విద్యార్థిని !
అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన స్వామీజీ మర్మాంగాన్ని ఓ విద్యార్థిని కత్తిరించిన సంచలన సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది.
కొచ్చి: అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన స్వామీజీ మర్మాంగాన్ని ఓ విద్యార్థిని కత్తిరించిన సంచలన సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. మర్మాంగం తెగిపోవడంతో శ్రీహరి అలియాస్ గంగేశానంద తీర్థాపాదం (54) అనే కామాంధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కోల్లాంలోని పన్మానా ఆశ్రంలో స్వామీజీ వేశంలో శ్రీహరి నివాసం ఉంటున్నాడు. శ్రీహరికి గంగేశానంద తీర్థపాదం అనే మారుపేరు ఉంది. తన ఆశ్రమానికి వస్తున్న వారిలో కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి ఇతను పూజలు చేసే నెపంతో వారి ఇంటికి వెళ్లి మహిళలు, యువతుల మీద లైంగిక దౌర్జన్యం చేస్తూ ఉంటాడని వెలుగు చూసింది.
విద్యార్థిని మీద కన్ను వేశాడు
తిరవనంతపురంలో నివాసం ఉంటున్న 22 ఏళ్ల విద్యార్థిని ఇంటికి పూజలు చెయ్యడానికి శ్రీహరి శుక్రవారం రాత్రి వెళ్లాడు. అర్దరాత్రి 12.30 గంటల సమయంలో పూజలు చేసే నెపంతో విద్యార్థిని మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆమె ఎంత అడ్డుకున్నా శ్రీహరి కామంతో రెచ్చి పోయాడు.
మర్మాంగం కోసేసింది
అంతే సహనం కోల్పోయిన విద్యార్థిని కత్తి తీసుకుని శ్రీహరి మర్మాంగం కత్తిరించేసింది. విషయం గుర్తించిన యువతి కుటుంబ సభ్యులు శ్రీహరిని తిరువనంతపురం మెడికల్ కాలేజ్ కు తరలించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
17 ఏళ్లలోనే లైంగిక దాడి
పోలీసులు శ్రీహరి మీద కేసు నమోదు చేశారు. తాను 17 ఏళ్ల వయస్సులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పటి నుంచి పూజలు చేసే నెపంతో శ్రీహరి తన ఇంటికి వచ్చి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని యువతి ఆరోపించింది.
ముందుగానే కత్తి సిద్దం
గత ఐదేళ్లుగా ఇతని లైంగిక దాడికి విసిగిపోయానని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంటికి పూజలు చెయ్యడానికి శ్రీహరి వస్తున్నాడని, కచ్చితంగా మళ్లీ లైంగిక దాడికి పాల్పడుతాడని తెలుసుకుని ముందుగానే కత్తి సిద్దం చేసుకుని ఇలా చేశానని బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది.
ఐసీయూలో కామాంధుడు
శ్రీహరికి శాస్త్ర చికిత్స చేసి ఐసీయూలో చికిత్స చేస్తున్నామని తిరువనంతపురం మెడికల్ కాలేజ్ వైద్యులు తెలిపారు. పూజలు చేసే నెపంతో శ్రీహరి తన ఆశ్రమానికి వచ్చే మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తించేవాడని సమాచారం అందిందని, దర్యాప్తు చేస్తున్నామని తిరువనంతపురం పోలీసులు తెలిపారు.