ఎలా?: అతడి జీతం రూ. 1200లే, కానీ కోటీశ్వరుడు!
భోపాల్: అతడు నెలరోజులపాటు సెలవు తీసుకోకుండా కష్టపడితే వచ్చేది కేవలం రూ. 1,200. అయితే, అతను మాత్రం రూ. కోట్లలో డబ్బులు కూడబెట్టాడు. ఆ మొత్తం జీతంతో కోటీశ్వరుడు కావడం చాలా కష్టమైన పనే. అయితే, సక్రమంగా అయితే అది సాధ్యం కాకపోవచ్చు గానీ, అక్రమంగా అయితే అది సాధ్యమేగా. అందుకే అతని ఆస్తులపై కన్నేసిన అధికారులు అతని గుట్టు రట్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలోని ఓ చిన్న దుకాణంలో సురేష్ పాండే అనే వ్యక్తి సేల్స్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి జీతం నెలకు రూ. 1200.
కాగా, అతడు కోట్ల రూపాయల్లో ఆస్తులు కూడబెట్టాడని, ఎలాంటి పన్నులు చెల్లించడం లేదని లోకాయుక్త అధికారులకు సమాచారం అందింది. దీంతో అతని నివాసాలపై సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే స్థిర, చర ఆస్తులు పత్రాలు లభించాయి. బంగారు ఆభరణాలు, డబుల్ బెరల్ గన్ కూడా వారు సీజ్ చేశారు.
అంతేగాక, బొలేరో వాహనం, ఆల్టో కారు, యాక్టివా, హోండా షైన్ బైక్ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి సంవత్సర సంపాదన కంటే 200 రెట్లు ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని లోకాయుక్త అధికారులు వెల్లడించారు. పాండే, అతడి భార్య, కుమారుడి పేరిట మొత్తం 8 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.
ఇప్పటికి సోదాలు ఆగిపోలేదని వారు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించాడనేదానిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.