దారుణం: టీచర్ను హత్య చేసిన 7వ తరగతి విద్యార్థులు
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చింసింగ్భుం జిల్లాలో దారుణం జరిగింది. పలు వ్యవసనాలకు బానిసలైన 7వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఓ టీచర్ను హత్య చేశారు. అతడి వద్ద ఉన్న నగదు దోచుకున్నారు. ఈ హంతక విద్యార్థులు తుంగ్రి మొహల్లా ప్రాంతంలోని సెయింట్ జేవియర్ బాలుర పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
సిగరెట్లు, మద్యం మానేయాలని, లేకుంటే వారి తల్లిదండ్రులకు చెబుతానని సదరు టీచర్ జాస్లిన్ టోప్నో ఎన్నోసార్లు ఆ విద్యార్థులను హెచ్చరించారు. ఈ ముగ్గురిలో ఓ విద్యార్థి టొప్నో ఉండే భవనంలోనే ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. మిగతా ఇద్దరూ తరచూ ఆ గదికి వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయుడ్ని చంపేసి అతని వద్ద ఉన్న నగదును అపహరించి బైకు కొనాలని ముగ్గురు విద్యార్థులు నిర్ణయించుకున్నారు.
టీచర్ను హత్య చేసేందుకు ఓ మిత్రుడ్ని తుపాకీ ఇమ్మని కోరగా.. అతడు అందుకు నిరాకరించాడు. దీంతో గొడ్డలితో చంపాలని నిశ్చయించుకున్నారు ఈ దుర్మార్గులు. టీచర్ గదిలోకి ప్రవేశించి ఒక్కసారిగా అతనిపై ఈ ముగ్గురు గొడ్డలితో దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న మరో విద్యార్థిని కూడా చంపేందుకు ప్రయత్నించగా.. అతడు తప్పించుకుని స్థానికులకు సమాచారం అందించాడు.
దీంతో ఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అప్పటికే నిందితుల్లో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. మరో నిందితుడ్ని స్థానికులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనానికి చేరుకుని నిందితుల్లో ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా, మిగతా ఇద్దరి ఆచూకీ బయటపడింది. ఆ ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం నిందితులు తుపాకీ అడిగిన మిత్రుడి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ వారికి రెండు దేశవాళీ పిస్టళ్లను, ఒక ఎయిర్ గన్, రెండు లైవ్ కార్ట్రిడ్జ్లు లభ్యమయ్యాయి. దీంతో ఆ బాలుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.