అడుగు పెడితే అరెస్టు చేస్తారని టీటీవీ దినకరన్ కు భయం ముహుర్తం ఫిక్స్ చేసిన సీఎం !
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో నాయకులతో సమావేశం కావడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సిద్దం అయ్యారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో నాయకులతో సమావేశం కావడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సిద్దం అయ్యారు. చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి గురువారం అందరూ రావాలని తమిళనాడులోని అన్ని జిల్లాల నాయకులు సమాచారం ఇచ్చారు.
రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ కార్యాయానికి వెళ్లి తాను పార్టీ కార్యక్రమాలు చూసుకుంటానని, పార్టీకి శశికళ తరువాత అన్నీ నేను అంటూ ఇటీవల టీటీవీ దినకరన్ చెప్పారు. తనను పార్టీ నుంచి తొలగించే హక్కు ఒక్క శశికళకు మాత్రమే ఉందని టీటీవీ దినకరన్ అన్నారు.
సీఎంతో సహ మంత్రులు నన్ను అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించలేరని టీటీవీ దినకరన్ మీడియా ముందు గొప్పలు చెప్పారు. పార్టీ నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎలా అడుగుపెడుతారు ? అని కొందరు మంత్రులు ప్రశ్నించారు.
అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో అడుగుపెడితే అరెస్టు చేయిస్తామని పళనిసామి వర్గీయులు గట్టిగానే హెచ్చరించడంతో టీటీవీ దినకరన్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇప్పుడు అన్నాడీఎంకే నాయకులు, మంత్రులతో రాయపేట్ లోని కార్యాలయంలో పార్టీ సమావేశం నిర్వహించాలని పళనిసామి నిర్ణయించారు. అందుకు గురువారం ముహుర్తం నిర్ణయించారని పళనిసామి వర్గీయులు తెలిపారు.