'పళనిస్వామి అద్దె కుర్చీలో కూర్చొన్నారు, ఎక్కువ కాలం ఉండలేరు, సంచలనం..'
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగలేరని కేంద్రమంత్రి రాధాక్రిష్ణన్ అభిప్రాయపడ్డారు. ఆయన అద్దె కుర్చీలో కూర్చున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
చెన్నై:అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ విధేయుడు తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళని స్వామి ఎంతో కాలం పదవిలో కొనసాగరని కేంద్ర మంత్రి పోన్ రాధాక్రిష్ణన్ అభిప్రాయపడ్డారు.
'స్వంత ఇంట్లో మన కుర్చీలో కూర్చోవడం, అద్దె కుర్చీలో కూర్చోవడం రెండు ఒకటి కాదంటూ 'పళనిస్వామిపై ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు.తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి 'అద్దె కుర్చీ'లో ఉన్నారని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.
'విశ్వాస పరీక్ష'లో పళనిస్వామి నెగ్గడంపై మంత్రి రాధాక్రిష్టన్ ఈ విధంగా స్పందించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరు నిజంగా సిగ్గు చేటన్నారు రాధాక్రిష్ణన్.
విపక్షాలు లేకుండానే స్పీకర్ ధన్ పాల్ బలపరీక్ష నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ఘటనతో రాష్ట్రమంతా తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు రాధాక్రిష్ణన్. ప్రతిపక్ష డిఎంకె నేతలపై దాడి విషయంపై విచారణ కమీషన్ ను వేయాలని ఆయన డిమాండ్ చేశారు.