దినకరన్ ఎఫెక్ట్: మంత్రుల మెడకు ఉచ్చు, చెన్నై వదిలి వెళ్లారు
అన్నాడీఎంకే నేత దినకరన్ లంచం కేసు తమిళనాడు మంత్రులకు కూడా చుట్టుకుంది. రెండాకుల గుర్తు కోసం ఈసీకి రూ.50 కోట్లకు లంచం ఇవ్వచూపిన కేసులో దినకరన్ సహా ఢిల్లీ పోలీసులు పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసింద
చెన్నై: అన్నాడీఎంకే నేత దినకరన్ లంచం కేసు తమిళనాడు మంత్రులకు కూడా చుట్టుకుంది. రెండాకుల గుర్తు కోసం ఈసీకి రూ.50 కోట్లకు లంచం ఇవ్వచూపిన కేసులో దినకరన్ సహా ఢిల్లీ పోలీసులు పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు తమిళ మంత్రులనూ వణికిస్తోంది.
పలువురు మంత్రులు.. పలు ప్రాజెక్టు కాంట్రాక్టులను అప్పగించడం ద్వారా ముడుపులను తీసుకుని వాటిని ఈసీకి లంచంగా ఇచ్చేందుకు నిర్ణయించుకుని, దినకరన్కు అప్పగించారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సాక్ష్యాలను సంపాదించినట్టుగా తెలుస్తోంది.
15 మంది మంత్రులకు నోటీసులిచ్చే ఛాన్స్
తొలి దశలో 15 మంది మంత్రులకు నోటీసులు ఇచ్చి, వారిని ప్రశ్నించేందుకు పోలీసులు కదులుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నోటీసులు సిద్ధమయ్యాయని, వాటిని నేడో, రేపో బట్వాడా చేయవచ్చని అంటున్నారు.
మిగతా డబ్బు ఎలా?
ఇక ఈసీకి రూ. 50 కోట్లను లంచంగా ఇచ్చేందుకు బేరాలు సాగిన ఈ కేసులో రూ.10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో పోలీసులకు తెలిసింది. మిగతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఉండేదన్న కోణంలో విచారణ సాగుతోంది.
ఇరవై మంది మంత్రుల బెంబేలు
పోలీసుల విచారణతో బెంబేలెత్తిపోతున్న తమిళనాడు మంత్రుల్లో 20 మంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు. వీరందరికీ కేసులో ఏదో ఓ రూపంలో సంబంధం ఉండి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు, వారెక్కడ ఉన్నారన్న విషయమై ఆరా తీస్తున్నారు.
మంత్రులే సమకూర్చారు
ఆ డబ్బునంతా మంత్రులే సమకూర్చినట్లు విచారణలో తేలినట్లుగా సమాచారం. దాదాపు ఇరవై మంది మంత్రులు చెన్నై నగరాన్ని విడిచి సొంత జిల్లాలకు తరలి వెళ్లారని చెబుతున్నారు. లంచం కేసు తమ మెడకు చుట్టుకుంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.
రూ.50 కోట్ల సేకరణపై దృష్టి
రెండాకుల గుర్తు కోసం ఢిల్లీ బ్రోకర్లకు అందించేందుకు గాను రూ.50 కోట్లను మంత్రుల ద్వారా సేకరించి పంపారని విచారణలో వెల్లడయింది. ఈ రూ.50 కోట్ల సేకరణపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.