'దేశంలోని ముస్లీం, క్రైస్తవుల పూర్వీకులు హిందువులే'
అహ్మదాబాద్: భారత్లో నివసిస్తున్న క్రిస్టియన్ల, ముస్లీంల పూర్వీకులు హిందూమతానికి చెందినవారేనని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా బుధవారం అన్నారు. మతమార్పిడుల అంశంపై పార్లమెంటులో రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని ముస్లీంలు, క్రైస్తవుల పూర్వీకులు హిందూ మతస్థులేనని, మొఘల్ చక్రవర్తుల కాలంలో నాటి దాష్టీకాలకు భయపడి ప్రజలు బలవంతంగా ఇస్లాంలోకి మారారని చరిత్ర చెబుతోందన్నారు. ప్రస్తుతం భారత దేశంలోని హిందువుల పైన ఎటువంటి దురాగతాలు, బలప్రయోగాలు కొనసాగడం లేదన్నారు.
ఈ వాతావరణంలో హిందూ సమాజంలోకి తిరిగి రావాలనుకునే వారి నిర్ణయాన్ని ఆ మతస్తులు హృదయపూర్వకంగా ఆమోదిస్తారని వ్యాఖ్యానించారు. గుజరాత్లోని భావ్ నగర్లో జరిగిన విశ్వహిందూ పరిషత్ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, పై వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర గవర్నర్తో మోహన్ భగవత్ భేటీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్చాలక్ మోహన్ భగవత్ బుధవారం మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో బుధవారం భేటీ అయ్యారు. ఇది మర్యదపూర్వకంగా జరిగిన సమావేశమేనని రాజ్భవన్ అధికార ప్రతినిధి ఆ తర్వాత ప్రకటించారు.
భాగవత్ని భోజనానికి రావాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారని, ఈ మేరకు ఆరెస్సెస్ కార్యవర్గ సభ్యులు కొందరితో ఆయన బుధవారం రాజ్భవన్కు వచ్చారని పేర్కొన్నారు. మరోవైపు, ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశ ప్రజలంతా వందేమాతరం పుస్తకాన్ని చదవాలని పిలుపునిచ్చారు.