కుక్క మాంసం వండలేదని చిత్రహింసలు
నోయిడా: కుక్క మాంసం వండలేదని పిల్లలను చిత్రహింసలకు గురి చేసిన రెస్టారెంట్ యజమానిని ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. చిత్రహింసలకు గురైన ముగ్గురు చిన్నారులను రక్షించి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
పోలీసుల కథనం మేరకు ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా నగరంలోని గామా 1 సెక్టార్ ఆఫీసర్స్ కాలనీలో మై స్పైస్ కేఫ్ రెస్టారెంట్ ఉంది. అవినాష్, ముఖేష్ రాజ్ పుత్ అనే ఇద్దరు ఈ రెస్టారెంట్ కు యజమానులు. వీరిద్దరు రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నారు.
ఈ రెస్టారెంట్ ఎదురుగా ప్రవీణ్ బట్టి అనే ఆయన నివాసం ఉంటున్నారు. నిత్యం ఈ హొటల్ లో పిల్లలు ఏడుస్తున్న విషయం ప్రవీణ్ గుర్తించాడు. అవినాష్ ను ప్రశ్నిస్తే అతను సినిమా స్టోరీలు చెప్పి చిన్నగా తప్పించుకునేవాడు.
గురువారం అర్దరాత్రి పిల్లలు గట్టిగా ఏడుస్తున్న విషయం గుర్తించిన ప్రవీణ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి రెస్టారెంట్ లో పరిశీలించారు. 5 నుండి 8 సంవత్సరాలు వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలు ఏడుస్తున్న విషయం గుర్తించారు.
వెంటనే వారిని ప్రశ్నించగా ప్రతి రోజు కుక్క మాంసం వండలేదని నిత్యం మమల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారని పిల్లలు చెప్పారు. పిల్లల చేతుల మీద వాతలు పెట్టారని, గాయాలైనాయని పోలీసులు అన్నారు. పోలీసులు ఐదు కుక్కలు, కుక్క మాంసాన్ని స్వాదీనం చేసుకుని అవినాష్ ను అరెస్టు చేశారు.
పిల్లలను మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ కేసులో ముఖేష్ రాజ్ పుత్ తప్పించుకున్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పిల్లలు చాలా కాలం నుండి ఇక్కడ పని చేస్తున్నారని , వారి కుటుంబ సభ్యుల గురించి ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.