పొగమంచు: ఏడు రోజులైనా ఆ రైలు మీరట్ దాటలేదు
మీరట్: ఉత్తర భారతంలో పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజు అలహాబాద్లో సాయంత్రం 5: 40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:50కి షహరాన్ పూర్ చేరే నౌచండి ఎక్స్ప్రెస్... ఏడు రోజులైనా మీరట్ దాటక పోడవం విశేషం.
నిజానికి ఈ రైలు మీరట్కు ఉదయం 8:30కి రావాల్సి ఉంది. దట్టమైన పొగ మంచు కారణంగా రైళ్లు రోజూ 6 గంటల నుంచి 8 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో నౌచండీ ఎక్స్ప్రెస్ను మీరట్ నుంచి వెనక్కి పంపాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మీరట్, షహరాన్ పూర్ల మధ్య నిత్యమూ తిరుగుతుండే ఉద్యోగులు, విద్యార్ధులు ఈ ట్రైన్ పైనే ఎక్కువ ఆధారపడి ఉంటారు. పొగమంచు కారణంగా మరుసటి రోజు రైలును రద్దు చేసేకన్నా మీరట్ నుంచి వెనక్కు పంపడం మేలని రైల్వే అధికారులు వ్యాఖ్యానించారు.
నౌచండీతో పాటు ఉత్తర భారతంలో మరికొన్ని రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఇక బుధవారం మీరట్-లక్నో రాజధాని ఎక్స్ప్రెస్ పొగమంచు కారణంగా రద్దు చేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో చాలా మంది ప్రయాణీకులు టిక్కెట్లను రద్దు చేసుకుంటున్నారు.