వ్యాపం స్కాం: చెరువులో శవమైన లేడీ ట్రైనీ ఎస్ఐ
భోపాల్: వ్యవసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపం) ద్వారా ఎస్ఐగా ఉద్యోగం సంపాదించి శిక్షణ తీసుకుంటున్న యువతి చెరువులో శవమై కనిపించింది. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన వ్యాపం స్కాంలోని నిందితులు, సాక్షులు వరుసగా అనుమానస్పద స్థితిలో మరణిస్తున్నారు.
వ్యాపం ద్వారా 2014లో అనామికా కుష్వాహ అనే యువతి ఎస్ఐగా ఎంపిక అయ్యారు. ఈమె సాగర్ జిల్లా పోలీసు శిక్షణా కేంద్రలో ట్రైనీగా ఉన్నారు. సోమవారం ఉదయం శిక్షణా కేంద్రం సమీపంలోని ఒక చెరువులో క్వుష్వాహ శవమై కనిపించింది.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గత రెండు రోజులలో వ్యాపం స్కాం కేసుతో సంబంధం ఉన్నమెడికల్ కాలేజ్ డీన్ అరుణా శర్మ, జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ అనుమానస్పద స్థితిలో మరణించారు.
ఇప్పుడు ట్రైనీ ఎస్ఐ కుష్వాహ మరణించారు. వ్యాపం స్కాంతో సంబంధం ఉన్న వారిలో ఇప్పటి వరకు 48 మంది మరణించారు. అయితే న్యాయస్థానం అనుమతి ఇస్తే వ్యాపం స్కాం కేసు సీబీఐతో దర్యాప్తు చేయించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంటున్నారు.