స్కూటర్ నడిపిన గడ్కరీ: నిబంధనల ఉల్లంఘన
నాగపూర్: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్రాఫిన్ నిబంధనలను ఉల్లంఘించారు. స్కూటర్ నడుపుతూ ఆయన శనివారం నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అయితే, ఆయన హెల్మెట్ ధరించకపోవడం వివాదానికి దారి తీసింది. హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ నితిన్ గడ్కరీ కెమెరా కంటికి చిక్కారు.
హెల్మెట్ ధరించకుండా స్కూటర్ నడిపి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను కలవడానికి ఆయన తెల్ల స్కూటర్పై నాగపూర్లోని మహల్ ప్రాంతంలో గల ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చారు.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆయన మోహన్ భగవత్ను కలవడానికి వచ్చారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంపై జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు గడ్కరీ మాట్లాడడానికి నిరాకరించారు.
గడ్కరీ వ్యవహారంపై కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. అది నాయకుడి ప్రవర్తనను, పార్టీ నడవడిని బయటపెట్టిందని ఆయన అన్నారు. ఇది చాలా చిన్న విషయమేనని, మరో వ్యక్తి అలా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అయితే చట్టాన్ని అమలు చేయాల్సిన మంత్రే ఆ విధంగా వ్యవహరిస్తే పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు.
గడ్కరీపై నాగపూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారా, లేదా అనేది తెలియదు. హెల్మెట్ ధరించడం చట్టప్రకారం తప్పనిసరి అని, దాన్ని ఉల్లంఘింస్తే 100 రూపాయల జరిమానా పడుతుందని నాగపూర్ ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ చెబుతోంది.