లవ్ ఎఫైర్: అర్థనగ్నంగా వీధిలో దంపతుల పరేడ్
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు దామ్నోద్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ముఖేష్ ఇజార్ధార్తోపాటు ఓ ఎస్ఐ, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఇండోర్ రేంజ్ ఐజీ విపిన్ మహేశ్వరి మీడియాకు తెలిపారు. ఘటనకు సంబంధమున్న 20మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జిల్లాలోని దామ్నోద్ పిఎస్ పరిధిలో గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.
ఆ దంపతులది వివాహ బంధం కాదనే అనుమానంతో వారిపై దాడి చేసిన గ్రామస్తులు అర్ధనగ్నంగా చేసి ఖోకారియా, బల్వారి, బయాదిపుర గ్రామాల మీదుగా వారిని ఊరేగించారు. గ్రామస్తులు బాధిత వ్యక్తిపై స్టీలు పళ్లెం, ముళ్ల కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత వారిద్దర్నీ ఓ చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు వారి ముఖానికి, శరీరానికి నల్లరంగును పూశారు.
ఐదుగురు పిల్లలకు తల్లి అయిన ఆ మహిళను బాధిత గిరిజన వ్యక్తి వివాహం చేసుకోవడాన్ని స్థానికంగా పంచాయతీ నిర్వహించిన పెద్దలు ఒప్పుకోకపోవడంతో గ్రామస్తులు ఈ విధమైన శిక్షను వారికి విధించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధమున్న 20మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గాయాలపాలైన బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు చెప్పారు. బాధితులకు తీవ్రమైన గాయాలేమి కాలేదని పోలీసులు తెలిపారు.