కష్టాల్లో పళనిసామి: 11 మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్?
చెన్నై: కేంద్రంలోని అధికార బీజేపీతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పినా తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామికి మంచి రోజులు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. పురచ్చితలైవిగా పేరొందిన జయలలిత మరణించిన తర్వాత తొలుత పన్నీర్ సెల్వంను సీఎంగా చేసిన జయ నెచ్చెలి శశికళ తర్వాత ఆ పదవి కోసం పోటీ పడటం అన్నాడీఎంకే ఉనికికే ప్రమాదం తెచ్చి పెట్టింది.
జయ అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలు కాగా, ఆమెకు అత్యంత సన్నిహితుడిగా పళనిస్వామి సీఎం అయ్యారు. కానీ మాజీ సీఎం పన్నీర్ సెల్వం బీజేపీ దన్నుతో పళనిస్వామితో బహిరంగంగా ఘర్షణకు దిగారు. దినకరన్ ఈసీ కేసులో చిక్కుకోవడం.. తర్వాత రెండు గ్రూపుల మధ్య రాజీ చర్చలు.. చివరకు బీజేపీకి మద్దతునిస్తున్నట్లు పళనిస్వామి సంకేతాలివ్వడంతో అనిశ్చితికి తెర పడిందని అంతా భావించారు.
అయితే పరిణామాలు మరో రూపం తీసుకున్నాయి. పళని స్వామి వర్గం వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు హాస్టల్లో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.
పళనిస్వామి గ్రూపు ఎమ్మెల్యేలు..
పళనిస్వామి గ్రూపునకు చెందిన 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే హాస్టల్లో సమావేశం కావడమే దీనికి నిదర్శనం. దీన్ని బట్టే తమిళనాడు సీఎం పళనిస్వామి పరిస్థితి సరిగ్గా లేదని ఈ పరిణామాలు చెప్తున్నాయి. పర్యాటక శాఖ మాజీ మంత్రి తొపు వెంకటాచలం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని సమాచారం. రవాణాశాఖ మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కూడా సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సెంగొట్టియన్ను విద్యాశాఖ మంత్రిగా నియమించడం ద్వారా తనను పళనిస్వామి పక్కనబెట్టేశారని వెంకటాచలం భావిస్తున్నట్లు వినికిడి.
సెంథిల్ బాలాజీ ఇలా నిరాహార దీక్ష
లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, రవాణాశాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్లకు వ్యతిరేకంగా మాట్లాడటంతో సెంథిల్ బాలాజీ పూర్తిగా తిరుగుబాటు దారుగా ముద్ర వేసుకున్నారు. వారిద్దరూ తన నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు అడ్డు తగులుతున్నారని సెంథిల్ బాలాజీ ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా నిరహార దీక్ష కూడా చేశారు.
సెంథిల్.. శశికళకు సన్నిహితుడు.. దినకరన్కు దూరందూరం
పన్నీర్ సెల్వం స్థానే పళనిస్వామిని సీఎంగా నియమించడానికి ముందు కొవత్తూరు రిసార్టులో తమకు ఇచ్చిన హామీల అమలులో ఆయన విఫలమయ్యారని భావిస్తున్న11 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా అసంత్రుప్తితో సమావేశమయ్యారని వినికిడి. తమకు ఇచ్చిన హామీలపైనే చర్చించారని తెలుస్తోంది. సెంథిల్ బాలాజీ ఎవరో కాదు శశికళా నటరాజన్ కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అదే సమయంలో ఎన్నికల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి రెండు కోట్ల రూపాయలు లంచం ఇవ్వడానికి సిద్ధమైన టీటీవీ దినకరన్కు దూరంగానే ఉన్నారు.
శశికళకు సన్నిహితుడు సెంథిల్ బాలాజీ
గతవారం తమిళనాడులో పర్యటించిన కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించిన సీఎం పళనిస్వామి పనితీరును పరిశీలించారు. తర్వాత మాజీ సీఎం జయలలితకు నివాళులర్పించారు. కానీ ఈ 11 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి దూరమైతే మాత్రం సీఎంగా ఆయన పదవికి కాలం మూడినట్లేనని భావిస్తున్నారు. అయితే దీనికి ఒక పరిష్కారం ఉన్నదని చెప్తున్నారు. వారికి ఇచ్చిన హామీలను అమలుచేస్తే చాలునని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక సెంథిల్ బాలాజీని అదుపు చేయడం కేవలం శశికళా నటరాజన్కు మాత్రమే సాధ్యమన్న అభిప్రాయం వినిపిస్తున్నది.