దినకరన్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు: దీప సంచలనం..
అమ్మ మరణాంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన దీప జయకుమార్.. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై పేరుతో పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించి ఒక్కరోజు కూడా గడవకుండానే ఆమె భర్త పార్టీని వీడారు.
చెన్నై: వారం క్రితం తన తమ్ముడు దీపక్ తనను హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన జయలలిత మేనకోడలు దీప.. తాజాగా టీటీవి దినకరన్ పై సంచలన ఆరోపణలు చేశారు. దినకరన్ తనను బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
జయను చంపేందుకు శశికళతో కలిసి నా సోదరుడు కుట్ర: దీప సంచలనం
పార్టీ జనరల్ సెక్రటరీగా చాలామంది తనకు మద్దతునిస్తున్నా.. తనకే మద్దతున్నట్లుగా దినకరన్ వ్యవహరిస్తున్నారని దీప పేర్కొనడం గమనార్హం. అన్నాడీఎంకెలో క్షేత్రస్థాయి కార్యవర్గమంతా తనవైపే ఉందని, పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు తనకే దక్కాలని వారు భావిస్తున్నారని దీప అన్నారు.
శనివారం ఉదయం ఓ టీవి ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా దీప.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమ్మ వారసత్వాన్ని తానే కొనసాగించాలన్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువవుతోందని, పార్టీని తానే నడిపించాలని చాలామంది కోరుకుంటున్నారని తెలిపారు.
కాగా, అమ్మ మరణాంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన దీప జయకుమార్.. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై పేరుతో పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించి ఒక్కరోజు కూడా గడవకుండానే ఆమె భర్త పార్టీని వీడారు. ఆ తర్వాత మళ్లీ దీపతో కలిసిపోయి పార్టీ కోసం పనిచేస్తున్నారు. అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉపఎన్నిక బరిలో దిగిన దీప.. అందులో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరారు.
మేనత్త పోలికలతో ఉండటం ప్రజల్లో తన పట్ల సానుకూల వైఖరి కలిగిస్తుందన్న నమ్మకంతో ఎన్నికల్లో దిగారు. కానీ ఎన్నికల సంఘానికి టీటీవి దినకరన్ లంచం ఇచ్చారన్న ఆరోపణలతో.. ఆర్కేనగర్ ఉపఎన్నిక రద్దయిపోవడంతో దీపకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఇంతలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్దమవుతుండటం.. అటు అన్నాడీఎంకెలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో దీప రాజకీయం ఆదిలోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది.