వేరే దిక్కులేదు: రంగంలోకి సీఎం, పన్నీర్: చిన్నమ్మతో దివాకరన్, ఢిల్లీలో టీటీవీ చక్కర్లు !
అన్నాడీఎంకే పార్టీలోని మూడు వర్గాల్లో రాజకీయం అంతా రహస్యంగా మారుతోంది. రహస్య మంతనాల్లో పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గం నిమగ్నం అయ్యాయి. కమలం పెద్దల దర్శనం కోసం టీటీవీ దినకరన్ ఢిల్లీలో మకాం వేశారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలోని మూడు వర్గాల్లో రాజకీయం అంతా రహస్యంగా మారుతోంది. రహస్య మంతనాల్లో పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గం నిమగ్నం అయ్యాయి. కమలం పెద్దల దర్శనం కోసం టీటీవీ దినకరన్ ఢిల్లీలో మకాం వేశారు.
హలో దినకరన్: ఒక్క ఫోన్ కాల్ తో ఢిల్లీకి పరుగో పరుగు. తిక్కచేష్టలు చేస్తే శాశ్వతంగా !
దినకరన్ ఆదిపత్యానికి చెక్ పెట్టడానికి పళనిసామి పన్నీర్ సెల్వంతో రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారని వెలుగు చూసింది. ఇదే సమయంలో పళనిసామి ప్రభుత్వానికి మెజరిటీ లేదని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే తెరమీదకు వచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చెయ్యడానికి డీఎంకే పార్టీ సిద్దం అయ్యిందని సమాచారం.
రోజురోజుకు ఆసక్తికర పరిణామాలు
తమిళనాడు రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. టీటీవీ దినకరన్ కు 32 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం, శశికళ సొంత సోదరుడు దివాకరన్ తో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రలు భేటీ కావడంతో సీఎం పళనిసామి అయోమయంలో పడిపోయారని తెలిసింది.
సీఎం కుర్చీకి ఎసరు ?
తాను ప్రభుత్వాన్ని కూల్చను అంటూ దినకరన్ చెప్పడంతో పళనిసామికి కొంత ఊరట ఇచ్చినా ఎక్కడ తన సీటుకు ఎసరుపెడుతాడో అంటూ పళనిసామి ఆందోళన చెందుతున్నారని తెలిసింది. ఇదే సమయంలో పన్నీర్ సెల్వంతో విలీన చర్చలు మొదలు పెట్టాలని పళనిసామి నిర్ణయించారని తెలిసింది.
నమ్మకం లేదు, స్వయంగా సీఎం !
విలీన చర్చలకు ప్రత్యేక కమిటీలు, మంత్రులతో మంతనాలు జరిపితే వ్యవహారం మొత్తం బహిర్గతం అవుతుందనే భయంతో స్వయంగా ముఖ్యమంత్రి పళనిసామి నేరుగానే పన్నీర్ సెల్వంతో మాట్లాడటానికి రంగం సిద్దం చేస్తున్నారని సమాచారం.
నేనే సీఎం. మీరు మాత్రం !
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పదవిలో పళనిసామి కొనసాగాలని నిర్ణయించారని తెలిసింది. అయితే అన్నాడీఎంకే (పురట్చి తలైవీ అమ్మ) నాయకుడు పన్నీర్ సెల్వంకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించాలని ఓ సీనియర్ మంత్రి పళనిసామికి సూచించారని తెలిసింది.
పన్నీర్ వస్తే కేంద్ర అండ ఉంటుంది !
పన్నీర్ సెల్వంతో రాజీ అయితే కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తోందని పళనిసామి వర్గం భావించింది. అందుకే ఇక ఆలస్యం చెయ్యకుండా రాజీ కావాలని స్వయంగా పళనిసామి పావులు కదుపుతున్నారని అన్నాడీఎంకే (అమ్మ) పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
దినకరన్, శశికళ టార్గెట్
ఢిల్లీ పెద్దలు దినకరన్ కు మద్దతు ఇవ్వకుండా చెయ్యాలంటే పన్నీర్ సెల్వంతో రాజీకావాలని కొందరు మంత్రులు పళనిసామి మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారు. పన్నీర్ సెల్వంతో రాజీ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ పెద్దలు దినకరన్ కు మద్దతుగా నిలిచే అవకాశం లేదని పలువురు మంత్రులు పళనిసామికి చెప్పారని తెలిసింది.
ఢిల్లీలో దినకరన్, నో చాన్స్
కేంద్రం, బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి టీటీవీ దినకరన్ ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే ఇప్పటి వరకూ ఆయనకు కేంద్రంలోని పెద్దల దర్శనభాగ్యం లభించలేదని సమాచారం. అయితే తన అనుచరులు, మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా దినకరన్ ఢిల్లీకి చెక్కేయడంతో పెద్ద చర్చ జరుగుతోంది.
శశికళలో దివాకరన్ ములాఖత్
గురువారం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళ సొంత సోదరుడు దివాకరన్ తో భేటీ అయ్యారు. దివాకరన్ బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో సోదరి శశికళతో ములాఖత్ కావడంతో ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
మళ్లీ తెర మీదకు మన్నార్ గుడి !
దినకరన్ కు 32 మంది ఎమ్మెల్యేలు, తనతో కలిసి ఎమ్మెల్యేలు, మంత్రుల విషయంపై శశికళతో దివాకరన్ చర్చించారని సమాచారం. మొత్తం మీద మన్నార్ గుడి మాఫియా సభ్యులు మళ్లీ తమిళనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి జోరుగానే ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది.