తెలంగాణ, ఎపి మధ్య కృష్ణా జలాల మంటలు
హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. నాగార్జునసాగర్ కుడికాల్వను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించిన కొద్దిగంటల వ్యవధిలోనే అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. అవసరాలకు తగ్గట్టు జలాలను వినియోగించుకోవాలనే ప్రాథమిక సూత్రం ఆధారంగా ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన ఉంది.
అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ జలాలను వినియోగించిందని అంటూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ కుడికాల్వకు నీటిని నిలిపివేసింది. తెలంగాణ ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ఆంధ్రప్రదేశ్ ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకు వచ్చింది. నీళ్లు నిలిపివేసే అధికారం వారికి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈక్రమంలో కృష్ణా జలాల యాజమాన్య బోర్డు రంగంలోకి దిగింది.
నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటిని నిలిపివేస్తామని గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తూ వస్తోంది. చివరకు అన్నంత పనీ చేసింది. మరోపక్క ఈ వివాదంపై ఇరు రాష్ట్రాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది.
నాగార్జున సాగర్ కింద నీటిని ఎలా వాడుకోవాలి...
కృష్ణానదిలో 616.37 టిఎంసిల నీటి లభ్యత ఉండగా, అందులో 549.65 టిఎంసిల నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకునే అవకాశం ఉంది. నీటిని తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాలు 42: 58 నిష్పత్తిలో వాడుకోవాలి. ఈ వాటా మేరకు తెలంగాణకు 228.71 టిఎంసిలు, ఏపీకి 320.94 టిఎంసిలు దక్కుతాయి. నాగార్జున కుడికాల్వ కింద 132 టిఎంసిలు, ఎడమకాల్వ కింద 132 టిఎంసిల కేటాయింపు ఉంది.
కుడికాల్వ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉండగా, ఎడమ కాల్వ కింద ఉన్న 132 టిఎంసిల్లో 99.75 టిఎంసిలు తెలంగాణకు మిగిలిన 32.25 టిఎంసిలు ఆంధ్ర వాడుకునే వీలుంది. ఎడమ కాల్వ కింద మొదటి జోన్లో ఖరీఫ్కు మాత్రమే కేటాయింపు ఉంది. అయితే కృష్ణాలో 480.688 టిఎంసిలు ఉండగా, ఇందులో తెలంగాణకు 41.61 శాతం అంటే 200.638 టిఎంసిలు ఉందని, ఇందులో వినియోగించుకోగా మిగిలిన నీటిని సాగర్ ఎడమ కాల్వ కింద రబీకి వినియోగించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
సాగర్ దిగువన 108 టిఎంసిలు లభిస్తుంది. ఈ నీటిని మినహాయిస్తే ఆంధ్ర కేటాయింపులకు మించి వాడుకుందని, ఉన్న నిల్వలను సాగర్ ఎడమ కాల్వ కింద రబీకి, తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటామని చెప్పింది. తమ ప్రతిపాదనలకు విరుద్ధంగా ఏపీ తన వాటాకుమించి 30.60 టిఎంసిలు నీటిని వాడుకుందని ఇప్పుడు మరింత నీటిని విడుదల చేయాలని కోరుతోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుతం సాగర్లోని 85 టిఎంసిల నీటిలో ఏపీ వాటా చుక్క కూడా లేదనేది తెలంగాణ వాదన. మిగిలిన మొత్తం నీటిని తెలంగాణ అవసరాలకే కేటాయించాలని ప్రభుత్వం బోర్డును కోరింది.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమకు 101 టిఎంసిల నీరు రావల్సి ఉందని వాదిస్తోంది. ఈ తరుణంలోనే రెండురోజుల క్రితం ఆంధ్రా ఎస్ఇ వెంకటేశ్వరరావు తెలంగాణ ఉద్యోగి నుంచి బలవంతంగా తాళం తీసుకుని తానే స్వయంగా కుడికాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. దాంతో సాగర్ డ్యాంవద్ద ఇరుపక్షాల బాహాబాహీతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
విభజన బిల్లు ప్రకారం నాగార్జున సాగర్ నిర్వహణ తెలంగాణకే దక్కుతుందని, శ్రీశైలం నిర్వహణ మాత్రమే ఆంధ్రకు దక్కుతుందని నిర్వహణ రాష్ట్రాల పరిధిలో ఉన్నా నీటి విడుదల అంశం మాత్రం కృష్ణా జలాల బోర్డు చూసుకుంటుందని అంటున్నారు. రోజుకు సాగర్ కుడి కాల్వ ద్వారా 3వేల క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 5వేల క్యూసెక్కుల నీరు ఆంధ్రకు విడుదల చేస్తున్నట్టు తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
గురువారం వరకూ కుడికాల్వకు ఉన్న 132 టిఎంసిల కేటాయింపును ఏపీ వినియోగించుకోవడం పూర్తికావడంతో తాము నీటిని నిలిపివేశామని తెలంగాణ అధికారులు. ఎడమకాల్వ కింద 99.75 టిఎంసిలు ఉండగా ఇంతవరకూ 101.9 టిఎంసిలు వాడుకున్నట్టు వారు చెబుతున్నారు.