బీఫ్ బ్యాన్ను సమర్థించిన టీవీ నటుడిపై దాడి
తిరువనంతపురం: గోమాంసం నిషేధంపై కేరళ విద్యాసంస్థల్లో వివాదం ముదురుతోంది. బీఫ్ బ్యాన్ను సమర్ధించిన ఓ టీవీ నటుడుపై కొందరు విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటన కేరళలోని అలెప్పూ సమీపంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అలెప్పూ సమీపంలోని ఒక కాలేజీ ఫంక్షన్కు వెళ్లి వస్తున్న టీవీ నటుడు, విశ్లేషకుడు అయిన రాహుల్ ఈశ్వర్పై కొంతమంది విద్యార్థులు చేయి చేసుకున్నారు. కాయంకులం ఎంఎస్ఎం కాలేజీ ఆవరణలో రాహుల్పై దాడిచేసిన విద్యార్థులు అతని కారును ధ్వంసం చేశారు.
శబరిమలై మతగురువు మనవడైన రాహుల్ పలు ప్రాంతీయ, జాతీయ టీవీ ఛానళ్లలో విమర్శకుడిగా తన వాదనలు వినిపిస్తుంటారు. ఈ క్రమంలో వివాదాస్పద అంశంగా మారిన బీఫ్ బ్యాన్ను సమర్ధిస్తూ జాతీయ మీడియా చర్చలో వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. దాడికి పాల్పడిన 15 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా, రెండ్రోజుల క్రితం ఇదే అంశంపై రాష్ట్రంలోని మరో కాలేజీలో కూడా వివాదం చెలరేగింది.
క్యాంపస్లో గోమాంసంతో విందు చేసుకున్న విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. యాజమాన్యం చర్యను ఖండించిన దీపా నిశాంత్ అనే మహిళా టీచర్ పైనా చర్యలు తీసుకుంది.
మరో ఘటనలో కొట్టాయంలోని ఓ కాలేజీలో దాద్రి ఘటనకు నిరసనగా బీఫ్ ఫెస్ట్ నిర్వహించిన కొందరు వామపక్ష విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది.