గల్ఫ్ లో కమర్షియల్ సెక్స్: నేపాల్ మహిళల రక్షణ
న్యూఢిల్లీ: అక్రమంగా విదేశాలకు యువతులను, మహిళలను తరలిస్తున్న ఇద్దరు విదేశీయులను న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నిందితులు గతంలో ఎంత మంది మహిళలను విదేశాలకు తరలించి సెక్స్ ర్యాకెట్లలో దించారనే విషయంపై ఆరా తీస్తున్నారు.
పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నేపాల్ లోని పలు ప్రాంతాలకు చెందిన 20 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉన్న 27 మంది యువతులు, మహిళలు మంగళవారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రం లోకి వెళ్లారు.
వారి వెంట ఇద్దరు పురుషులు ఉన్నారు. 27 మంది మహిళలు గుంపుగా ఉండటం, వారి వెంట ఇద్దరే పురుషులు ఉండటంతో విమానాశ్రయం అధికారులకు అనుమానం వచ్చింది. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారించారు.
బిష్ణు తమాంగ్ (29), నుపానే (30) అనే ఇద్దరు బ్రోకర్లు అసలు విషయం వెల్లడించారు. ఆఫ్రికాలోని టాంజానియా, కెన్యా దేశాలలో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి మహిళలను పిలుచుకుని ఢిల్లీ వచ్చారని వెలుగు చూసింది.
అంతే కాకుండా ఆ దేశాలకు వెళ్లకుండా వీరు దుబాయ్ కి ప్రయాణించడానికి సిద్దం అయ్యారని పోలీసులు చెప్పారు. దుబాయ్ లో ఈ మహిళలను కమర్షియల్ సెక్స్ కేంద్రాలలో విక్రయించడానికి ప్లాన్ వేశారని అన్నారు. 27 మంది యువతులు, మహిళలకు చదువు లేదని, చూడటానికి బలంగా, చాల అందంగా ఉన్నారని పోలీసులు అన్నారు.
వెంటనే నేపాల్ మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అంధించారు. బుధవారం 27 మంది మహిళలను క్షేమంగా నేపాల్ పంపించారు. మహిళలు వారివారి ఇండ్లకు క్షేమంగా చేరుకున్నారని పోలీసు అధికారులు అన్నారు. మహిళలను అక్రమంగా దుబాయ్ కి తరలిస్తున్న ఇద్దరు బ్రోకర్లను పోలీసు అధికారులు విచారిస్తున్నారు.