వయసు తొమ్మిదేళ్లే.. అయితేనేం తొణకకుండా సాక్ష్యం.. ఇద్దరికి 'యావజ్జీవ శిక్ష'
ఈ కేసుకు సంబంధించి మొత్తం 11మంది నిందితులను విచారించగా.. వారెవరూ వాంగ్మూలం ఇవ్వలేదు. అయితే తొమ్మిదేళ్ల బాలిక మాత్రం ధైర్యంగా కోర్టు ముందు సాక్ష్యం చెప్పడంతో నిందితులకు శిక్ష తప్పలేదు.
థానే: ఎంత అత్యవసరమైనా సరే.. ఎందుకొచ్చిన తలనొప్పి అని పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లెక్కని వారు చాలామందే ఉంటారు. న్యాయం తమవైపే ఉన్నా ఆ క్రమంలో ఎదురయ్యే చిక్కులు.. కోర్టులు చుట్టూ పలుమార్లు తిరగాల్సి రావడం సామాన్యులకు వ్యయప్రయాసలతో కూడుకున్నది. అన్నింటికి మించి సాక్ష్యం చెప్పడానికి సాక్ష్యులు ముందుకురాకపోతే.. ఇక ఆ కష్టాలు చెప్పనలవి కాదు.
అయితే తొమ్మిదేళ్ల ఓ బాలిక మాత్రం ఎలాంటి వణుకు, బెణుకు లేకుండా ధైర్యంగా కోర్టు ముందు సాక్ష్యం చెప్పింది. తొమ్మిదేళ్ల ఆ బాలిక చెప్పిన సాక్ష్యాధారాలతో మహారాష్ట్రలోని థానే కోర్టు ఇద్దరికి యావజ్జీవ శిక్ష విధించింది. కేసులో నిందితులైన కామ్లిబాయ్ వాఘె (46), ఫారూఖ్ ఖాన్ లు ఈ శిక్ష అనుభవించనున్నారు.
మరో నిందితుడు విజయ్ పవార్(40)ను 'సంశయ లాభం' కింద విడుదల చేశారు. భీవాండీలో చోటు చేసుకున్న ఓ వివాహేతర సంబంధం కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంగా విజయ్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి 2010, అక్టోబర్ 2న శివాజీ జాదవ్ అనే వ్యక్తిని హతమార్చాడు.
ఈ కేసుకు సంబంధించి మొత్తం 11మంది నిందితులను విచారించగా.. వారెవరూ వాంగ్మూలం ఇవ్వలేదు. అయితే తొమ్మిదేళ్ల బాలిక మాత్రం ధైర్యంగా కోర్టు ముందు సాక్ష్యం చెప్పడంతో నిందితులకు శిక్ష తప్పలేదు.