రేప్, కిడ్నాప్ కింద ఛార్జీషీట్: ప్రభుత్వ లాయర్ కావాలన్న ఉబేర్ డ్రైవర్
హైదరాబాద్: ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ యాదవ్ పైన ఢిల్లీ పోలీసులు బుధవారం ఛార్జీషీటు దాఖలు చేశారు. తీస్ హజారీ న్యాయస్థానంలో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. 27 ఏళ్ల యువతి పైన ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన సంఘటన ఇటీవల సంచలనం రేపిన విషయం తెలిసిందే.
పోలీసులు ఉబేర్ క్యాబ్ డ్రైవర్ పైన అత్యాచారం, అపహరణ, బెదిరింపు తదితర సెక్షన్ల కింద ఛార్జీషీట్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఈ ఛార్జీషీటును జనవరి 2, 2015వ తేదీన పరిశీలనలోకి తీసుకోనుంది.
ఇదిలా ఉండగా, నిందితుడు డ్రైవర్ శివకుమార్ యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రభుత్వ లాయర్ కావాలని కోరారు. మరోవైపు, ఉబేర్ క్యాబ్ సర్వీసు పైన నిషేధం ఎత్తివేతకు కోర్టు నిరాకరించింది. యువతి పైన అత్యాచారం అనంతరం ఉబేర్ క్యాబ్ల పైన ఢిల్లీలో నిషేధం విధించారు.
ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ ఓ యువతి పైన అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఉబేర్ సంస్థ క్షమాపణ చెప్పింది. ఉబేర్ సంస్థకు చెందిన కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన పైన ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది. కేసుకు సంబంధించి అధికారులకు సహకరిస్తామని చెప్పింది.
నేరాల పుట్ట..
ట్యాక్సీ డ్రైవర్ శివకుమార్ యాదవ్ విషయమై ఆయన గ్రామంలో కొద్ది రోజుల క్రితం విచారించారు. అతను మామూలు మనిషి కాదని నేరాల పుట్ట అని చెబుతున్నారు. పలు అత్యాచారాలు చేసినట్లు అతనే స్వయంగా పోలీసుల విచారణలో వెల్లడించాడు. అతని సొంత ఊర్లో మీడియా విచారించింది.
పలువురు మహిళలు ముందుకొచ్చి తమ పైన జరిగిన దాడులను వివరించారు. వారిలో ఒకరు సమీప బంధువు. పిన్నీ అని పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె వాపోయింది. డిగ్రీ చదివి యువతి అతని బారినపడ్డ నేరానికి చదువు మానేసి పెళ్లి చేసుకొని వెళ్లిపోవాల్సి వచ్చింది.
నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో మహిళ కనబడితే గొంతు నొక్కి, తుపాకీ పెట్టి బెదిరించి అత్యాచారం చేసేవాడని తెలిపారు. ఒంటరిగా కాపుకాసి, నోరెత్తనీయకుండా పీకనొక్కేవాడని, తుపాకీ చూపి బెదిరించేవాడని, ఒంటిమీద నగలు కూడా దోచుకున్నాడని పలువురు మహిళలు వాపోయారు. ఒకరిద్దరు మాత్రమే కుటుంబ సభ్యుల అండతో ఫిర్యాదు చేశారు. మిగిలిన వాళ్ల అందరు పరువు కోసం నోర్మూసుకొని బతకవలసి వచ్చిందని వాపోయారు.