'జయ'ను ఆంటీ అని పిలిచేంత క్లోజ్.. ఐఏఎస్ సబితకు మంత్రి షాక్!
మిగతా అధికారులంతా జయలలితను మేడమ్ అని సంబోధిస్తే.. సబిత మాత్రం 'ఆంటీ' అని పిలిచేవారు. దీన్నిబట్టి జయలలితకు ఆమె వద్ద ఎంత చనువు ఉందో అర్థం చేసుకోవచ్చు.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత ఉన్నన్ని రోజులు విద్యాశాఖ కార్యదర్శి, ఐఏఎస్ సబితకు తిరుగులేకుండా పోయింది. ఎంతమంది ఐఏఎస్ అధికారులను వేరే శాఖలకు బదిలీ చేసినా.. సబిత మాత్రం విద్యాశాఖ కార్యదర్శిగానే ఆరేళ్ల పాటు కొనసాగింది. అయితే పళనిస్వామి ప్రభుత్వం కొలువుదీరాక ఎట్టకేలకు ఆమెపై బదిలీ వేటు తప్పలేదు.
అయితే ఈ వేటు వెనుక విద్యాశాఖ మంత్రి సెంగొట్టయన్ ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యానాథన్ పై ఒత్తిడి తీసుకొచ్చి సబితాను సిమెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శాఖకు బదిలీ చేశారు. మొత్తం 17మంది ఐఏఎస్ లను వేరే శాఖలకు బదిలీ చేస్తూ పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాగా, జయలలిత సీఎం కుర్చీలో ఉన్నన్ని రోజులు సబితా దర్జా ఒలకబోశారన్న వాదనలున్నాయి. మిగతా అధికారులంతా జయలలితను మేడమ్ అని సంబోధిస్తే.. సబిత మాత్రం 'ఆంటీ' అని పిలిచేవారు. దీన్నిబట్టి జయలలితకు ఆమె వద్ద ఎంత చనువు ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు జయలలిత పాల్గొనే కార్యక్రమాల్లోను సబితా సందడి చేసేవారు.
ఈ నేపథ్యంలో ఒకానొక దశలో జయలలిత ప్రత్యేక కార్యదర్శిగా సబితా నియమితులవుతారన్న చర్చ కూడా జరిగింది. మొత్తం మీద జయలలిత ఉన్నన్ని రోజులు సబితను ప్రశ్నించడానికి కూడా అధికారులు జంకారంటే ఆమె ఏ స్థాయిలో చక్రం తిప్పారో తెలుస్తోంది.
పళనిస్వామి ప్రభుత్వం కొలువుదీరాక ఒకానొక దశలో విద్యాశాఖ మంత్రి సెంగొట్టయన్ కు, సబితకు మధ్య తీవ్ర అంతర్గత పోరు నడిచినట్లుగా చెబుతారు. ఈ పరిణామాలతోనే ఆమెపై బదిలీ వేటు పడినట్లుగా సమాచారం. కొత్త విద్యాశాఖ అధికారిగా ఉదయచంద్రన్ నియమితులయ్యారు.
సబితపై బదిలీ వేటును ఇతర ఐఏఎస్ లు ఆనందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదీగాక, ఇప్పుడిక సిమెంట్ శాఖకు గండం పట్టుకుందని పలువురు జోకులు పేలుస్తుండటం గమనార్హం.