ఒడిశాలో మరో ఘోరం : శవం ఎముకలు విరిచి మోసుకెళ్లారు..
బలసోర్ : పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకుంటూ.. చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో.. భార్య శవాన్ని తన భుజాలపైనే ఏకంగా 12 కి.మీ వరకు ఓ భర్త మోసుకుంటూ వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన ఒరిస్సాలోనే ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకుంది.
అంబులెన్స్ అందుబాటులో లేని కారణంతో.. చనిపోయిన ఓ వృద్దురాలి మృతదేహాన్ని విరగొట్టి, ముక్కలు చేసి ఓ సంచిలో మూటగట్టి.. ఆపై వెదురు బొంగులకు వేలాడదీసి మోసుకుంటు వెళ్లారు ఇద్దరు ఆసుపత్రి ఉద్యోగులు. చనిపోయిన తర్వాత మృతదేహం బిగుసుకుపోవడంతో.. ఆ శవాన్ని ఎలా తరలించాలో అర్థంగాక.. ఎముకలు విరగొట్టి ముక్కలు చేసినట్లుగా చెబుతున్నారు సదరు ఉద్యోగులు.
సలామణి బారిక్ అనే 76 ఏళ్ల వృద్దురాలు గత బుధవారం రైలు ప్రమాదంలో చనిపోవడంతో.. పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆమెను స్థానిక బలసోర్ ఆసుపత్రికి తరలించారు. అయితే సమయానికి పోస్ట్ మార్టమ్ చేసే వైద్యులు అందుబాటులో లేకపోవడం.. మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కూడా లేకపోవడంతో.. ఎలాగోలా శవాన్ని అక్కడినుంచి రైల్వే స్టేషన్ కు తరలించాల్సిందిగా ఆసుపత్రిలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు చెప్పారు ఆసుపత్రి సిబ్బంది.
ఈ విషయంలో తాను నిస్సహాయుడిగా ఉన్నానని.. తన తల్లి ఎముకలు విరగొట్టి తీసుకెళుతుంటే.. ధీనంగా చూస్తుండిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు వ్యాధిగ్రస్తుడైన మృతరాలి కొడుకు రబీంద్ర బారిక్. విషయం తెలుసుకున్న మానవ హక్కుల కమిషన్ దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రైల్వే పోలీసులతో పాటు జిల్లా అధికారులను ఆదేశించింది.