నమ్మశక్యం నిజం!: రైలు ఢీకొట్టిని, బతికిన యువతి (వీడియో)
ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లో నమ్మశక్యం కాని సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని రైలు ఢీకొట్టింది. కానీ ఆమె బతికింది. ఇది అక్కడి సిసి కెమెరాల్లో రికార్డయింది.
ముంబై: ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లో నమ్మశక్యం కాని సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని రైలు ఢీకొట్టింది. కానీ ఆమె బతికింది. ఇది అక్కడి సిసి కెమెరాల్లో రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది.
ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నప్పటికి చాలామంది రైల్వే స్టేషన్లలో పట్టాలు దాటుతారు. పైగా, పట్టాలు దాటేటప్పుడు రైలు వస్తుందా లేదా అని కూడా సరిగా చూసుకోరు. కుర్లాలోను ఓ యువతి ఇలాగే పట్టాల పైకి రాగానే ఎదురుగా రైలు వచ్చి, ఆమెను ఢీకొట్టింది.
#WATCH Dramatic visuals: Girl survives after being run over by a train in Mumbai pic.twitter.com/C5ZYf84CL9
— ANI (@ANI_news) June 7, 2017
కానీ ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. బాండూప్కు చెందిన ప్రతిక్ష నటెకర్ కుర్లాలోని తన స్నేహితులను కలవడానికి వచ్చింది. తిరిగి బాండూప్ వెళ్లడానికి కుర్లా స్టేషన్ లోని 7 వ నెంబర్ ప్లాట్ ఫాంకు వెళ్లడానికి ట్రాక్ను క్రాస్ చేస్తోంది.
ఆ సమయంలో ఆ ట్రాక్ పై నుంచి ఎదురుగా గూడ్స్ రైలు వచ్చింది. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉండటంతో ఆ ట్రాక్ పై వచ్చే గూడ్స్ను ఆమె చూడలేదు. ఫ్లాట్ ఫాం పై ఉన్న ప్రయాణికులు ప్రతిక్షను గమనించి కేకలు వేశారు.
అంతలోనే రైలు తన దగ్గరికి వచ్చేసింది. గూడ్స్ డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేసినా ఫలితం లేకపోయింది. రైలు ప్రతిక్షను తాకింది. ట్రాక్ మధ్యలో పడిపోయింది. మీద నుంచి రెండు మూడు బోగీలు వెళ్లిన తర్వాత రైలు ఆగిపోయింది. చనిపోయి ఉంటుందని అందరూ భావించారు.
కానీ ఆమె కేకలు వేసింది. ఆమెను బయటకు లాగారు. రైలు బలంగా తాకడంతో ఎడమ కన్నుకు చిన్నగాయం అయింది. పెద్ద పెద్ద గాయాలు మాత్రం కాలేదు. వెంటనే బాధితురాలిని దగ్గర్లోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు.