వాజ్పేయికి మత్తు ఇచ్చి.. రాజకీయాలు అర్థం కాకుండా చేశారు: లాలూ సంచలనం
వాజ్పేయికి మత్తు మందు ఇచ్చి ఆయనకు రాజకీయాలు అర్థం కాని పరిస్థితిని కల్పించారని లాలూ సంచలన ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని వాజ్పేయిపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో వాజ్పేయి ఇంటికే పరిమితమైన నేపథ్యంలో.. ఆయన అనారోగ్యంపై లాలూ అనుమానం వ్యక్తం చేశారు.
వాజ్పేయికి మత్తు మందు ఇచ్చి ఆయనకు రాజకీయాలు అర్థం కాని పరిస్థితిని కల్పించారని లాలూ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని టార్గెట్ చేస్తూ లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. లాలూ చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీతో పాటు ఇటు సామాన్య జనంలో ప్రకంపనలు సృష్టించాయి.
ఈ నేపథ్యంలో బీహార్ కు చెందిన కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాధామోహన్ లాలూ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. లాలూ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని, ఆఖరికి ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ సైతం లాలూ వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని అన్నారు.
కాగా, చాలాకాలంగా వాజ్పేయి రాజకీయాలకు దూరమైన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఆయనకు భారతరత్న ఇచ్చిన సమయంలోను ప్రోటోకాల్ ను సైతం పక్కనబెట్టి స్వయంగా రాష్ట్రపతి ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందించారు. ఆ సమయంలో కేవలం వాజ్పేయి అవార్డు అందుకున్నట్లుగా కొన్ని ఫోటోలను మాత్రమే విడుదల చేశారు.
ఆ తర్వాత మళ్లీ వాజ్పేయికి సంబంధించిన ప్రస్తావనే లేదు. ఆయన ఫోటోలు లేవు.. ఆరోగ్యం గురించిన ఎలాంటి సమాచారమూ లేదు. ఆయన బయటకు రాలేని స్థితిలో ఉన్నారన్న ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. లాలూ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవద్దని బీజేపీ వ్యాఖ్యానించినా.. అసలు వాజ్పేయి ఆరోగ్యంపై ఎందుకింత గోప్యత అన్న ప్రశ్నలు పలువురిలో తలెత్తుతున్నాయి.