ఊహించని ఘటనకు కేంద్రమంత్రి షాక్: 'షూ' విసరడంతో ఉద్రిక్తత..
సమావేశంలో ప్రసంగించేందుకుమాండవీయ నిలబడగానే.. సభలో కూర్చున్న భవేశ్ పటేల్(20) అనే యువకుడు ఆయనపై షూ విసిరాడు.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయకు పటీదార్ ఉద్యమ సెగ తగిలింది. మన్సుక్ తన జిల్లా భావనగర్ లోని వల్లభిపూర్ మున్సిపాలిటీలో పర్యటిస్తున్న నేపథ్యంలో.. పటీదార్ ఉద్యమ కార్యకర్త ఒకరు ఆయనపై షూ విసిరారు. వల్లభిపూర్ మున్సిపాలిటీ నిర్వహించిన ఓ సమావేశంలో ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది.
సమావేశంలో ప్రసంగించేందుకుమాండవీయ నిలబడగానే.. సభలో కూర్చున్న భవేశ్ పటేల్(20) అనే యువకుడు ఆయనపై షూ విసిరాడు. ఈ ఊహించని ఘటనకు కేంద్రమంత్రి షాక్ తిన్నాడు. అయితే కొద్దిపాటిలో ఆ షూ కేంద్రమంత్రిని తగలకుండా పక్కన పడిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు భవేశ్ పటేల్ను అదుపులోకి తీసుకున్నారు.
మీడియాతో మాట్లాడేందుకు భవేశ్ పటేల్ ప్రయత్నించినప్పటికీ.. పోలీసులు అతన్ని అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. కాగా, భవేశ్ పటేల్.. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) భావనగర్ రీజియన్కు కన్వీనర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. కేంద్రమంత్రిగా ఉండి కూడా యువకులకు ఏమి చేయలేదన్న కోపంతోనే అతను షూ విసిరినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, గుజరాత్ లోని పటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హార్థిక్ పటేల్ నేతృత్వంలో ఆ సామాజికవర్గానికి చెందినవారు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు హార్థిక్ పటేల్ జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది.