ఉల్లికి, పిజ్జాకు తేడా తెలియదు కానీ, నాయకుడవుతాడట: రాహుల్పై నఖ్వీ ఫైర్
భోపాల్: కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి ఉల్లిగడ్డకు పిజ్జాకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు రైతుల నాయకుడుగా ముందుకొస్తున్నారని విమర్శించారు.
'రాహుల్కి ఉల్లిగడ్డకు పిజ్జాకు, వంకాయలకు బర్గర్లకు తేడా తెలియదు. కానీ, ఆయన రైతుల నాయకుడుగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన ఎప్పటికీ ఈ విషయంలో విజయవంతం కాలేరు' అని ఆయన చెప్పారు.
మధ్యప్రదేశ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నఖ్వీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వాన్ని కొనియాడారు. తొలిసారి రాజకీయాలకంటే దేశ అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తమదని చెప్పుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ పెరిగిందని చెప్పారు. కొన్నిసార్లు ప్రభుత్వాన్ని అసత్యాలతో నిందిస్తున్నారని వాస్తవాలేంటో ప్రజలకు, మీడియాకు తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ మీడియా అధికారిక ప్రతినిధులకు తెలియజేశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజలకు ఉపయోగపడే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఇది మీ బాధ్యత అని వారికి చెప్పారు. భూసేకరణ బిల్లుపై రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం వచ్చాక.. దేశాన్ని దోచుకున్న వారి పరిస్థితి కష్టాల్లో పడిందని అన్నారు.