జయ ఆరోగ్యం: మాట్లాడకుండా వెళ్లిపోయిన వెంకయ్య, 135 మంది సంతకాలు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు సోమవారం సాయంత్రం అపోలో ఆసుపత్రిని సందర్శించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు సోమవారం సాయంత్రం అపోలో ఆసుపత్రిని సందర్శించారు.
వైద్యులను కలిసి జయ ఆరోగ్యం గురించి వాకబు చేసారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంకయ్య నాయుడు వచ్చాక కీలక ప్రకటన వస్తుందని అందరూ భావించారు. ఆ మేరకు ప్రచారం కూడా జరిగింది. కానీ వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.
జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద బారికేడ్లుతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కాగా, జయలలిత వారసుడిగా పన్నీరు సెల్వంకు పట్టం కట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పన్నీరు సెల్వంను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. 135 మంది ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంకు మద్దతుగా సంతకాలు చేశారని తెలుస్తోంది.