ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు: అసెంబ్లీలో దుమారం
లక్నో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై సీనియర్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో పెద్ద దుమారం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సభలో చర్చ మొదలైయ్యింది.
ఆసందర్బంలో శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి అజంఖాన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు చేశారు. మన దేశ బాద్దా తన తల్లిని ఇంటిలో పెట్టుకోరు, కాని శత్రువు తల్లికి కానుకలు ఇస్తారు.
భార్యను వదిలేసిన ఆయన బేటీ బచావో అంటూ నినాదాలు చెయ్యడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అజంఖాన్ వ్యాఖ్యలపై సభలో ఉన్న బీజేపీ సభ్యులు మండిపడ్డారు. దేశ ప్రధానిని ఇలాగేనా మాట్లాడేది అంటూ విరుచుకుపడ్డారు.
వెంటనే అజంఖాన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ వేల్ లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆ సందర్బంలో సభలో గందరగోళం నెలకొంది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ మాతాప్రసాద్ పాండే హామీ ఇచ్చారు.
అయితే బీజేపీ సభ్యులు మాత్రం ఆందోళన విరమించకపోవడంతో సభను వాయిదా వేశారు. 2014లో తన ప్రమాణ స్వీకార వేడుకకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమ్మకు మోడీ శాలువను కానుకగా ఇచ్చారు.
ఆ తరువాత నవాజ్ షరీఫ్ తల్లికి ఓ చీరను కానుకగా పంపించిన విషయం తెలిసిందే. ఈ విషయాలు గుర్తు పెట్టుకున్న మంత్రి అజంఖాన్ తన నోటికి పని చెప్పడంతో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో దుమారం రేపింది.