'యోగి' సీఎం అయ్యాడు సరే!.. మరి అన్నేసి కేసుల మాటేంటి?
2007వరకు ప్రత్యక్షంగా మత ఘర్షణల్లో పాల్గొన్న ఆదిత్యనాథ్ ఆ తర్వాత నుంచి తెర వెనుక పాత్రకు మాత్రమే పరిమితమయ్యారు.
లక్నో: అధికారం చెంతనుంటే ఏ కేసులు రాజకీయ నాయకులను నిలువరించలేవన్న విషయం చాలాసార్లు స్పష్టమవుతూనే ఉంది. అందుకే నాయకులంతా అధికారం కోసం పాకులాడుతుంటారు. తాజా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై కూడా గతంలో పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడాయన సీఎంగా కొలువుదీరడంతో ఇక ఆ కేసులు అటకెక్కినట్లేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కాగా,1999 ఫిబ్రవరి 10న ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లా పాంచ్ రుఖియా గ్రామంలోని ఓ ముస్లింల స్మశానం పట్ల ఆదిత్యానాథ్ దౌర్జన్యపూరితంగా వ్యవహరించారన్న అభియోగాలు ఉన్నాయి. స్మశానాన్ని స్వాధీనం చేసుకునేందుకు తన అనుచరులను వెంటేసుకుని వెళ్లిన ఆదిత్యనాథ్ కు అక్కడ పోలీసులు తారసపడటం షాక్ ఇచ్చినట్లయింది. ఆదిత్యనాథ్ బృందాన్ని పోలీసులు తరిమికొట్టారు. దీంతో ఆదిత్యనాథ్ సహా ఆయన అనుచురలంతా ప్రధాన రహదారి వైపు పరుగు తీశారు.
అయితే ప్రధాన రహదారిపై అప్పటికే కొంతమంది ఎస్పీ కార్యకర్తలు అప్పటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన ఆదిత్యనాథ్ యోగి బృందం వారిపై కాల్పులకు తెగబడింది. దీంతో ఎస్పీ ఆందోళన కార్యక్రమానికి నాయకత్వం వహించిన తలత్ అజీజ్ బాడీ గార్డు సత్యప్రకాశ్ యాదవ్ ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి.. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఘటనకు సంబంధించి అదే రోజు సాయంత్రం ఆదిత్యనాథ్ సహా ఆయన 24మంది అనుచురులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం, దొమ్మి, అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉండటం, ముస్లింల పవిత్ర స్థలంలోకి అనుమతి లేకుండా దౌర్జన్యంగా ప్రవేశించడం తదితర అభియోగాల కింద ఆదిత్యనాథ్ పై కేసులు నమోదయ్యాయి. ఆ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఆయన యూపీ సీఎంగా కొనసాగుతుండటంతో ఇక ఆ కేసులు ముందుకు సాగవనేది స్పష్టమవుతోంది.
స్మశానం కేసు తర్వాత 2002 గోద్రా అల్లర్ల నేపథ్యంలో హిందూ యువ వాహిణి సంస్థను ఏర్పాటు చేసిన ఆయన.. ఆ సంస్థ ద్వారా పలు మత ఘర్షణల్లో పాల్గొన్నారు. అప్పటినుంచి పలు మత ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా వాటన్నింటిలోను ఆదిత్యనాథ్ కు ప్రమేయం ఉందన్న అభియోగాలున్నాయి. ఈ కేసులన్ని ఇప్పటికీ విచారణలోనే ఉన్నాయి.
కాగా, 2007వరకు ప్రత్యక్షంగా మత ఘర్షణల్లో పాల్గొన్న ఆదిత్యనాథ్ ఆ తర్వాత నుంచి తెర వెనుక పాత్రకు మాత్రమే పరిమితమయ్యారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ వస్తున్నారు. ఈ ప్రసంగాలపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఏదేమైనా ఎంపీగా ఉన్నప్పుడే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేని పోలీసులు.. ఇక సీఎం అయ్యాక ఇంకేం చర్యలు తీసుకుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.