పూర్వాంచల్పైనే ఆశలు: దూకుడుగా కమలనాథుల ప్రచారం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకున్నది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పూర్తిగా ఆ ప్రాంతంపైనే ద్రుష్టిని కేంద్రీకరించారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకున్నది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పూర్తిగా ఆ ప్రాంతంపైనే ద్రుష్టిని కేంద్రీకరించారు. అందులో భాగంగానే ఇప్పటివరకు లక్నో కేంద్రంగా ప్రచారం నిర్వహించిన బిజెపి.. తాజాగా వారణాసి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది.
తుది దశ పోలింగ్ జరిగే వరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ప్రధాని మోదీ నియోజకవర్గ కేంద్రం వారణాసి నుంచే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూర్వాంచల్ ప్రాంతంలోని 89 స్థానాలకు వచ్చేనెల 4,8 తేదీల్లో చివరి రెండు దశల్లో పోలింగ్ జరుగనున్నది. ఇక నుంచి తమ ప్రచారం దూకుడుగా ఉంటుందని కమలనాథులు చెప్తున్నారు. అందుకోసం అలహాబాద్లో ఈ నెల 21న జరిగిన రోడ్షో ముగించుకుని నేరుగా పుణ్యక్షేత్రం వారణాసి నగరానికి చేరుకున్నారు.
వచ్చే నెల ఆరో తేదీన ప్రచార ముగింపునాడు వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు మార్చి మూడో తేదీన ప్రధాని మోదీ సభ నిర్వహించనున్నారు. మీర్జాపూర్, జాన్పూర్లలో మరో రెండు ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారు. అమిత్ షాతోపాటు గోరఖ్పూర్ రీజియన్లో యోగి ఆదిత్యానాథ్ సామర్థ్యం, వారణాసి రీజియన్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రజాదరణ అందరికీ తెలిసిన విషయమేనని, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలు పొందేందుకు పూర్వాంచల్ రీజియన్లోని 89 స్థానాలు చాలా కీలకమని బిజెపి సీనియర్ నేత ఒకరు చెప్పారు.
కమలనాథుల విశ్వాసం ఇదీ...
తొలి రెండు దశల్లో వెనుకబడినా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కమలనాథుల అంతర్గత అంచనాల్లో వెల్లడవుతున్నది. పార్టీకి పూర్తిగా పట్టు ఉన్న పూర్వాంచల్ రీజియన్లో పార్టీ అద్భుతమైన విజయాలు సాధిస్తుందని, పార్టీకి మెజారిటీ తెచ్చి పెడ్తుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంటే అధికార ఎస్పీ 50, బీఎస్పీ 14 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
అది తప్ప మిగతావన్నీ
జాన్పూర్ జిల్లాలోనే తొమ్మిది సీట్లు, వారణాసిలోని ఎనిమిది స్థానాలకు మూడు నియోజకవర్గాల్లో విజయం సాధించిన బిజెపి.. ఆజంగఢ్లో బోణీ చేయలేదు. ఇక గోరఖ్ పూర్ ప్రాంతంలోని 8 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో గొప్ప విజయాలే సాధించింది. ఆజంగఢ్ మినహా పూర్వాంచల్ రీజియన్లోని 18 స్థానాలకు 17 లోక్సభా నియోజకవర్గాల్లోనూ విజయం సాధించింది.
ఓట్ల శాతంపైనే దృష్టి...
ఆజంగఢ్ స్థానం నుంచి ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ విజయం సాధించారు. కానీ ఆజంగఢ్ పరిధిలో 2012 ఎన్నికలతో పోలిస్తే 2014 లోక్సభ ఎన్నికల్లో ఓట్లశాతం 10 నుంచి 33 శాతానికి ఓట్లు పెరిగాయని బీజేపీ సీనియర్ నేత చెప్పారు. 2014 ఎన్నికల్లో జాన్పూర్లో 53 శాతం పెరిగింది. 2012 ఎన్నికలతో పోలిస్తే మూడు రెట్లు ఓట్లు పెరిగాయి. పూర్వాంచల్లో తన ఓట్ల శాతాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని బీజేపీ శ్రేణులు చెప్తున్నారు.
ముస్లిం ఓట్ల చీలికపై ఆశలు..
ముఖ్తార్ అన్సారీ సారథ్యంలోని ఖ్వామీ ఏక్తాదళ్ పార్టీని బీఎస్పీలో చేర్చడంతో పూర్వాంచల్ ప్రాంతంలో బీఎస్పీ, ఎస్పీ మధ్య ముస్లింల ఓట్లు చీలిపోతాయని బీజేపీ నేతలు జోస్యం చెప్తున్నారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా వారణాసిలో తిష్ఠ వేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పూర్వాంచల్ ప్రాంతంలోని పార్టీ ఎంపీలతో కలిసి సమాలోచనలు చేస్తున్నారు. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, స్మ్రుతి ఇరానీ, కల్రాజ్ మిశ్రా, అనుప్రియ పటేల్ తదితరులతో బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వారిద్దరు జాయింట్ రోడ్ షో
వారణాసిలో యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 27వ తేదీన సంయుక్తంగా రోడ్ షో నిర్వహించనున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బిఎస్పి'లను ‘కసబ్' అని సరిపోల్చిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, సమాధులు - శ్మశాన వాటికల పోలికల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారు.