పెళ్ళికి బ్యాండ్ మేళం వాడారని దళితులు వాడే బావిలో కిరోసిన్ కలిపారు
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా దళితులు, పీడితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తాజాగా జరిగిన ఘటన ఒకటి రుజువు చేసింది.
భోపాల్: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా దళితులు, పీడితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తాజాగా జరిగిన ఘటన ఒకటి రుజువు చేసింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మానా గ్రామంలోమేఘ్ వాల్ అనే దళితుడు తన కుమార్తె వివాహన్ని బ్యాండ్ బాజాతో ఘనంగా జరిపించాడు. దీన్ని సహించలేక కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దళితులు వినియోగించే తాగునీటి బావిలో కిరోసిన్ కలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ 23న, మేఘ్ వాల్ తన కుమార్తె వివాహం ఘనంగా నిర్వహించాడు. వివాహా కార్యక్రమానికి వరుడు మోటార్ బైక్ పై వచ్చాడు. అనంతరం బ్యాండ్ మేళంతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో కొందరు అగ్రవర్ణాలవారు దీనికి అభ్యంతరం చెప్పారు.
గ్రామంలో కొందరు అగ్రవర్ణాలకు చెందినవారు మాత్రమే పెళ్ళి ఊరేగింపులు నిర్వహించాలని తమ అభ్యంతరాలను చెప్పారు.ఈ విషయాన్ని దళితులు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్ళారు.ఆయన గ్రామంలో పోలీసు బందో బస్తు ఏర్పాటు చేయించారు.
పోలీసుల ఆధ్వర్యంలో పెళ్ళి సంబరాలు ఘనంగా జరిగాయి.పరిస్థితి సాధారణస్థితికి చేరుకొందని భావించిన ప్రభుత్వయంత్రాగం పోలీసు బలగాలను వెనక్కు రప్పించింది. అయితే కొద్దిరోజులకే దళితులు తాగునీటి కోసం ఉపయోగిస్తున్న బావిలో గుర్తు తెలియని వ్యక్తులు భారీగా కిరోసిన్ కలిపారు.ఈ నీరు తాగడానికి పనికిరాకుండాపోయింది.
మేఘ్ వాల్ ను అతనికి మద్దతుగా నిలిచిన దళితులను దేవాలయంలోకి రాకుండా స్థానిక గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అయితే మంచినీటి కోసం స్థానికులు సమీపంలో ఉన్న నది వద్దకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకొంటున్నారు. దళితుల కోసం త్వరలోనే రెండు చేతిపంపులను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లాయంత్రాంగం ప్రకటించింది.