యూపీ సీఎం ఎవరో నేడే తేల్చనున్నారు: పరిశీలకులుగా వెంకయ్య!..
సీఎం రేసులో ఉన్న కేంద్రమంత్రి రాజ్ నాథ్, యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ ప్రసాద్ మౌర్యల కన్నా కేంద్రమంత్రి మనోజ్ సిన్హా పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఊహించిన రీతిలో పోటిని ఏకపక్షం చేసిన బీజేపీ.. ప్రస్తుతం సీఎం అభ్యర్థి ఎంపికలో తలమునకలైంది. గత కొద్దిరోజులుగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ.. అసలు అభ్యర్థి ఎవరనేది నేటి సాయంత్రంతో తేలిపోనుంది. ఈ మేరకు లక్నోలోని లక్నోలోని కాన్షీరామ్ స్మృతి ఉప వన్లో బీజేపీ వర్గాలు నేటి సాయంత్రం 4గం.కు సమావేశం కానున్నాయి.
సీఎం రేసులో కేంద్రమంత్రులు మనోజ్ సిన్హా, రాజ్ నాథ్ సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ.. పార్టీ అజాతశత్రువుగా భావించే మనోజ్ సిన్హాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అయితే సీఎం రేసులో ఉన్న వీరంతా.. ఎవరికి వారు తాము సీఎం అయ్యే అవకాశాలను తోసిపుచ్చారు.
కొత్త సీఎం సహా కేబినెట్ మంత్రులంతా ఆదివారం సాయంత్రం 5గం.కు ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో.. నేటి సాయంత్రానికి దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే సమావేశనాంతరం వివరాలు వెల్లడిస్తారా? లేక రేపటివరకు ఉత్కంఠను కొనసాగిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు.
కాగా, నేటి సాయంత్రం జరగబోయే ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, పర్యవేక్షకులుగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
కొత్తవారికి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు:
ప్రస్తుతం తెరపై వినిపిస్తున్న పేర్లు కాకుండా కొత్త పేర్లను కూడా బీజేపీ తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని హర్యానా, గుజరాత్ రాష్ట్రాల ప్రస్తావనను పలువురు పరిశీలకులు ఉదహరిస్తున్నారు. శనివారం నాటి భేటి తర్వాత సీఎం ఎవరనే దానిపై పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మనోజ్ సిన్హాకే ఎందుకు ఎక్కువ అవకాశాలు:
సీఎం రేసులో ఉన్న కేంద్రమంత్రి రాజ్ నాథ్, యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ ప్రసాద్ మౌర్యల కన్నా కేంద్రమంత్రి మనోజ్ సిన్హా పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకునిగా ఆయనకు పార్టీలో మంచి పేరు ఉంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం, మిస్టర్ క్లీన్ ముద్ర ఉండటంతో ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
1982లో 23ఏళ్ల వయసులో మనోజ్ సిన్హా రాజకీయాల్లోకి ప్రవేశించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్ యు) విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1998,1999లలో లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో మళ్లీ లోక్సభకు ఎన్నికయ్యి ప్రధాని మోడీ మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.
కేంద్రమంత్రిగాను ప్రధాని మోడీ మెప్పు పొందారు. ఈ కారణాలతోనే యూపీ సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు.