యూపీలో అలజడి: బాబాయ్ కి దెబ్బ కొట్టిన అఖిలేష్
లక్నో: ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్నసమాజ్ వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదిరిపాకనపడింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అమర్ సింగ్ పై తీవ్ర స్థాయిలో పండిపడ్డారు. మా కుటుంబంలో కలహాలకు అమర్ సింగ్ కారణం అని మండిపడ్డారు.
మా కుటుంబాన్ని విచ్చిన్నం చేయడానికి అమర్ సింగ్ కంకణం కట్టుకున్నారని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కొంతకాలంగా ఉన్న విభేదాలు ఆదివారం తారస్థాచికి చేరింది. అఖిలేష్ యాదవ్ తన చిన్నాన శివపాల్ యాదవ్ తో సహ నలుగురు మంత్రులపై వేటు వేశారు.
అంతే కాకుండా బహుబాష నటీ, మాజీ ఎంపీ జయప్రదను ఎఫ్ డీసీ నుంచి తొలగించి తన నిరసన వ్యక్తం చేశారు. వీళ్లంతా సమాజ్ వాదీ పార్టీకి మచ్చ తెస్తున్నారని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. తరువాత తన మద్దతుదారులతో అఖిలేష్ యాదవ్ సమావేశం అయ్యారు.
ఈ సమావేశానికి సమాజ్ వాదీ పార్టీకి చెందిన 105 మంది శాసన సభ్యులు, 31 మంది ఎంఎల్ సీలు హాజరైనారు. అనంతరం మీడియాతో మాట్లాడిన యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అమర్ సింగ్ మద్దతుదారులు మా మద్దతుదారులు కాదని కుండలు బద్దలుకొట్టి చెప్పారు.
మంత్రి పదవి ఊసిపోవడంతో అగ్గిమీదగుగ్గిలం అయిన శివపాల్ యాదవ్ వెంటనే తన మద్దతుదారులతో కలిసి నేరుగా తన అన్న ములాయం సింగ్ యాదవ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ శివపాల్ తన అన్న ములాయం సింగ్ యాదవ్ తో చర్చించారు. ములాయం సింగ్ యాదవ్ వెంటనే తన మద్దతుదారులతో సమావేశం అయ్యారు. తాజా పరిణామాలతో యూపీ ప్రభుత్వం ఏమౌతుందో ? అని పలు పార్టీల నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.