మోడీ హవా, అఖిలేష్కు 'రాహుల్' దెబ్బ: మాయావతి 'కీ' రోల్?
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ను బట్టి చూస్తుంటే బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ను బట్టి చూస్తుంటే బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి.
యూపీ ఎన్నికల్లో బీజేపీకి మేజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ.. అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. దీంతో బీజేపీకి ఎవరి మద్దతు ఉంటుంది లేక ఏఏ పార్టీలు కలుస్తాయనే చర్చ సాగుతోంది.
ఉత్తర ప్రదేశ్లో..
ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళిని చూస్తుంటే యూపీలో హంగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో 403 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 185 నుంచి 210 స్థానాల వరకు గెలుపొందవచ్చునని చెబుతున్నాయి. మేజిక్ ఫిగర్ 202. ఆ మేరకు స్థానాలు గెలుచుకుంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
యూపీలో ఎవరెవరు కలుస్తారు?
దాదాపు అన్ని సర్వేలు బీజేపీకి 185 స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. ఒక్క సర్వే మాత్రమే 210 వరకు వస్తాయని చెబుతోంది. అన్ని సర్వేలను పరిగణలోకి తీసుకుంటే హంగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీజేపీకి చెక్ చెప్పేందుకు..
హంగ్ వచ్చే అవకాశముంటే.. బీజేపీ - బీఎస్పీ కలుస్తుందా? బీహార్లో వలె బీజేపీకి చెక్ చెప్పేందుకు ఎస్పీ - బీఎస్పీ కలుస్తాయా అనే చర్చ సాగుతోంది. బీహార్లో బీజేపీని ఎదుర్కొనేందుకు జేడీయూ - ఆర్జైడీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు దిగాయి. యూపీలో ఎన్నికలకు ముందు ఎస్పీ - బీఎస్పీ పొత్తు పెట్టుకోలేదు. ఎస్పీ - కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. కాబట్టి ఎస్పీ-కాంగ్రెస్లకు బీఎస్పీ కలిసేనా అనే చర్చ సాగుతోంది.
బీఎస్పీ కీ రోల్.. మాయావతిని కేసులు అడ్డుకుంటాయా?
యూపీలో బీజేపీకి 185, ఎస్పీ - కాంగ్రెస్ కూటమికి 120, బీఎస్పీకి 90 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కలిసే అవకాశాలే లేవు. ఇక, బీఎస్పీయే కీలకం కానుందని అంటున్నారు. కేసులు ఎదుర్కొంటున్న మాయావతి బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. మొత్తానికి బీఎస్పీ కీలకం కానుందని అంటున్నారు.
మోడీ హవా
2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 80 లోకసభ స్థానాలకు గాను 73 గెలుచుకుంది. మోడీ హవా వల్లే గెలిచాయి. ఇప్పుడు కూడా 55 స్థానాల నుంచి 185 స్థానాలు గెలుచుకుంటారని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చినా రాకున్నా... మోడీ హవా విపక్షాలు ఆరోపించినంతగా తగ్గలేదనే తెలుస్తోందంటున్నారు.
మోడీని ఎదుర్కొనేందుకు జత కలిసినా... ఆశలు అడియాసలు
బీజేపీని, మోడీని ఎదుర్కొనేందుకు ఎస్పీ - కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు కారణంగా మేజిక్ ఫిగర్ సులభంగా దాటుతామని, 300 స్థానాలు గెలుచుకుంటామని అఖిలేష్ - రాహుల్ గాంధీలు భావించారు. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే మోడీ హవా కనిపిస్తోంది. మోడీ హవా ఎస్పీ-కాంగ్రెస్ ఆశలను కిల్ చేసింది.
దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్-ఎస్పీ
యీపీలో కాంగ్రెస్-ఎస్పీలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏమాత్రం ఆశలు లేని కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల సమాజ్ వాది పార్టీ కూడా దెబ్బతిన్నదని చెబుతున్నారు. ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం వల్ల గెలిచే స్థానాలను కూడా ఎస్పీ కోల్పోయిందని అంటున్నారు.