లలిత్ మోడీ ట్వీట్, ఆంటీ సోనియా: మండిపడ్డ వరుణ్
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ మరో బాంబు పేల్చారు. బీజేపీ నేత వరుణ్ గాంధీని వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడి పరిస్థితిని చక్కబెడతానని తనకు సహాయం చేయచూపారని లలిత్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
వరుణ్ గాంధీ లండన్లో తనను కలిసి సోనియా గాంధీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని మోడీ ఆరోపించాడు. లండన్లో తన ఇంట్లోనే వరుణ్ను కలిశారని అన్నారు. దీనిపై బిజెపి ఎంపీ వరుణ్ తీవ్రంగా ఖండించారు.
మోడీ ఆరోపణలు అవాస్తవాలే కాకుండా పనికిమాలినవని కొట్టిపారేశారు. వరుణ్ గాంధీ కొన్నేళ్ల క్రితం లండన్లోని తన నివాసానికి వచ్చారని, ఐపిఎల్తో నాకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారని, ఆంటీ సోనియాతో మాట్లాడతానని వరుణ్ చెప్పారని లలిత్ మోడీ పేర్కొన్నారు.
ఇద్దరికి తెలిసిన ఓ మిత్రుడు వరుణ్ను తనకు పరిచయం చేశాడని ట్వీట్ చేసిన మోడీ ... ఆంటీ సోనియా ఆరు కోట్ల డాలర్లు అడిగినట్టు తనతో అన్నారని అని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టతకు భంగం కలిగించడానికి మోడీ ఆరోపణలు చేస్తున్నారని వరుణ్ ధ్వజమెత్తారు.
బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ కూడా స్పందించారు. వరుణ్ గాంధీ, సోనియా గాంధీ ఒకే కుటుంబానికి చెందినవారైనప్పటికీ పార్టీలు వేరని స్పష్టం చేశారు. కాగా తన వ్యాఖ్యలను లలిత్ మోడీ మరో ట్విట్టర్లో సమర్థించుకున్నాడు.