హాని ట్రాప్లో వరుణ్ గాంధీ! : దేశ రక్షణ విషయాలు లీక్! పీఎంవోకు లేఖ
న్యూఢిల్లీ : జాతీయ భద్రతను పణంగా పెట్టి.. దేశ రక్షణ విషయాలను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ లీక్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాని ట్రాప్ లో చిక్కుకున్న వరుణ్ గాంధీ.. బ్లాక్ మెయిల్ కు గురై దేశ రక్షణ విషయాలను లీక్ చేశారని ప్రధాని మోడీ పీఎంవో కార్యాలయానికి లేఖ అందింది.
అమెరికాకు చెందిన సి ఎడ్మండ్స్ ఎలెన్ అనే న్యాయవాది సెప్టెంబర్ 16న లేఖ ద్వారా ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వరుణ్ గాంధీ హాని ట్రాప్ లో చిక్కుకున్నారని, విదేశీ వ్యభిచారిణులతో ఆయన గడిపిన ఫోటోలను ఆధారంగా చేసుకుని, ఆయన్ను బ్లాక్ మెయిల్ చేసి సదరు విదేశీయులు దేశ రక్షణ విషయాలను తెలుకోగలిగారని ఎడ్మండ్స్ ఎలెన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో వివాదస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ కీలక పాత్ర పోషించారని ఎడ్మండ్స్ చెప్పుకొచ్చారు. వరుణ్ గాంధీని వాడుకుని భారత్ తో ఆయుధ ఒప్పందాల కోసం ప్రయత్నిస్తోన్న విదేశీయులకు ఆయన దేశ రక్షణ వివరాలను చేరవేశాడన్నది ఎడ్మండ్స్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. కాగా, 2012వరకు అలెన్ వర్మతో కలిసి వ్యాపార భాగస్వామిగా కొనసాగాడు అభిషేక్ వర్మ. వరుణ్ గాంధీ పార్లమెంటరీ రక్షణ కమిటీ సభ్యుడిగా ఉండడంతో అతనికి కొంత సమాచారం తెలుసుంటుంది కాబట్టి.. ఆ సమాచారాన్ని వరుణ్ గాంధీ బయటకు లీక్ చేశారని ఎలెన్ ఆరోపించారు.
అయితే తనపై వస్తోన్న ఆరోపణలను కొట్టిపారేశారు వరుణ్ గాంధీ. ఇదంతా ఓ పనికిమాలిన వ్యవహారమని, ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు చేస్తున్నవాళ్ల వద్ద ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు వరుణ్ గాంధీ. ఎడ్మండ్స్ తన లేఖలో పేర్కొన్నట్లు తానెప్పుడూ పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కాలేదని తెలిపారు. హాని ట్రాప్ లో చిక్కుకున్నట్లు చెబుతోన్న వార్తలను ఆయన ఖండించారు.
వచ్చే యూపీ ఎన్నికల్లో తన పొలిటికల్ పాత్రపై దెబ్బ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే లేనిపోని కథలు అల్లి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మనీ లాండరింగ్ కు, మోసాలకు పాల్పడుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్న ఎడ్మండ్స్ ఎలెన్, అభిషేక్ వర్మ, 2012 జనవరిలో తమ ఆయుధ తయారీ భాగస్వామ్యాన్ని తెగదెంపులు చేసుకున్నారు. అప్పటినుంచి అభిషేక్ వర్మ మీద పలు ఆరోపణలు చేస్తూ.. భారత్ కు పలు లేఖలు, పత్రాలు రాస్తూనే ఉన్నారు ఎడ్మండ్స్. ఎడ్మండ్స్ చేసిన పలు ఆరోపణల ఆధారంగా అభిషేక్ కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించి బెయిల్ పై విడుదలయ్యాడు.