ఆవును ఢీకొన్న అమిత్ షా కాన్వాయ్లోని వాహనం: విమర్శలు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్లోని ఓ వాహనం ఢీకొని ఆవుకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఒడిశాలోని బర్చానా ప్రాంతంలో చోటు చేసుకుంది.
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో పర్యటస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్లోని ఓ వాహనం ఢీకొని ఆవుకు గాయాలయ్యాయి. ఈ ఘటన బర్చానా ప్రాంతంలో చోటు చేసుకుంది.
అయితే, గాయపడిన ఆవును పట్టించుకోకుండా వెళ్లారంటూ బీజేడీ నేతలు అమిత్ షాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆవులను రక్షిస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఇలా గాయపపర్చి పట్టించుకోకుండా వెళ్లడంపై బీజేడీ సీనియర్ నాయకుడు తాథగత్ సత్పతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, బర్చానా పోలీస్ స్టేషన్ పరిధిలోని బండాలో జాతీయ రహదారి నెం.5 ప్రాంతంలో ఆవును అమిత్ షా కాన్వాయ్ లోని వాహనం ఢీకొందని ఓ పోలీస్ అధికారి చెప్పారు. ఆవు రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో వీఐపీ స్టిక్కర్ ఉన్న ఆ వాహనం కూడా దెబ్బతిందని చెప్పారు.
అయితే, ప్రమాదం జరగడానికి ముందే అమిత్ షా ఉన్న వాహనం ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయిందని, ఈ ప్రమాదం గురించి ఆయనకు తెలియదని సదరు అధికారి తెలిపారు.
ఇది ఇలా ఉండగా, ప్రమాదం జరిగిన వెంటనే తాము కారు ఆపి.. ప్రమాదానికి గురైన ఆవుకు చికిత్స ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశామని బీజేపీ సీనియర్ నేత ప్రతాప్ సారంగి తెలిపారు. జాజ్పూర్ జిల్లా కలెక్టర్కు ఈ మేరకు సమాచారం ఇచ్చి.. ఆవుకు మెరుగైన చికిత్స అందించాలని కోరినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. పోలీసుల సాయంతో ఆవుకు చికిత్స అందించారని చెప్పారు. ఆవుకు చికిత్స అందించిన వైద్యులు.. ఆవు పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారని ప్రతాప్ సారంగి తెలిపారు.