ప్రజాస్వామ్య విరుద్ధం: ఎబిఎన్, టీవీ9 బ్యాన్పై వెంకయ్య
న్యూఢిల్లీ: మీడియా గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను నిలిపివేయడం సరికాదని ఆయన అన్నారు. ఈ వ్యవహారం కేంద్రం దృష్టిలో ఉందని వెంకయ్యనాయుడు చెప్పారు.
మీడియాపై ఆంక్షలను కేంద్రం సహించబోదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మీడియాను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోరాదని ఆయన అన్నారు. మీడియా, పత్రికలు మన ప్రజాస్వామ్యంలో ఒక భాగమని ఆయన తెలిపారు. మీడియా, పత్రికలు ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటివని ఆయన అన్నారు. కర్ణాటకలో టీవీ9పై ఆంక్షలు విధించిన విషయాన్ని కూడా వెంకయ్యనాయుడు ప్రస్తావించారు.
గతంలో హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానళ్ల విషయంలో ఇలాగే చేశారని వెంకయ్య నాయుడు ఆరోపించారు. అసలు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందన్న విషయంపై పూర్తి సమాచారాన్ని తెప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో టీవీ9 ప్రసారాల నిలిపివేత నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఆ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను నిలిపేశారు. కోర్టు జోక్యంతో హాత్వే టీవీ9 ప్రసారాలను పునరుద్ధరించింది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు మాత్రం రావడం లేదు. కేబుల్ ఆపరేటర్లు మాత్రమే ప్రసారాలను నిలిపేశారని, తమ ప్రభుత్వానికి సంబంధం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అదే రీతిలో సమాధానం ఇచ్చింది.
తాజాగా, కర్ణాటక రాష్ట్రంలో టీవీ9 ప్రసారాలు నిలిచిపోయాయి. చానెళ్ల సంపాదకులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. టీవీ9 ప్రసారాల నిలిపివేతతో తమ ప్రభుత్వానికి సంబంధం లేనది ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.