డైలామాలో వెంకయ్య.. విషయం తేలేదెప్పుడో..!
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీ కాలం త్వరలో ముగుస్తుండడంతో.. ఆ తర్వాత ఆయన స్థానమేంటనే దానిపై ఇంకా డైలామా కొనసాగుతోంది. గవర్నర్ గా గానీ పార్టీ అవసరాల కోసం గానీ వెంకయ్య సేవలను ఉపయోగించుకోనున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా..! దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.
ఇకపోతే వెంకయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న కర్ణాటక నుంచి కూడా ఈ దఫా ఆయనకు ఛాన్స్ లేనట్టే అన్న వాదన వినిపిస్తోంది. రాజ్యసభ కోసం ఇప్పటికే అక్కడ వేరే వాళ్ళ పేర్లు కూడా ఖరారైపోయాయని సమాచారం. అదీగాక పార్టీ తరుపున మూడుసార్లకు మించి రాజ్యసభకు పంపించొద్దన్న పార్టీ నిబంధన ఉన్నందువల్ల వెంకయ్య చూపు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుపై పడింది.
అయితే ఇప్పటికే ఒకసారి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను టీడీపీ తరుపున రాజ్యసభకు పంపించినందువల్ల ఇప్పుడు మళ్లీ ఇంకో సీటును త్యాగం చేయడానికి టీడీపీ నేతలు సిద్దపడుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. పైగా నిర్మలా సీతారామన్ ను పార్టీ తరుపున రాజ్యసభకు పంపించినా.. పార్టీకి ఒరిగిందేమి లేదన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో ఎప్పటినుంచో వినిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వెంకయ్యకు టీడీపీ అవకాశం ఇస్తుందా లేదా అన్నది తేలాలంటే ఇంకొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.