వెంకయ్య నాయుడిపై విహెచ్ సభా హక్కుల నోటీసు
న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంక య్యనాయుడుపై కాంగ్రెస్ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు శుక్రవారం రాజ్యసభలో సభా హక్కుల నోటీసు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని పార్లమెంటరీ నిషిద్ధ భాషలో దూషించానంటూ వెంకయ్య ప్రచారం చేశారని, అది అసత్యమని శుక్రవారం వీహెచ్ తెలిపారు. ఈ అంశంపై రాజ్యసభలో ఆయన మాట్లాడారు. తానేమీ అనక పోయినప్పటికీ అన్నానంటూ, రాజకీయంగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని తెలిపారు.
దేశ ప్రధానిని దూషించే కుసంస్కారిని కాదని ఆయన అన్నారు. ఈ నేపథ్యం లో ఈనెల 17నాటి రికార్డులను పరిశీలించి, తప్పు చేసినట్లు తేలితే శిక్షించాలని, లేదంటే వెంకయ్య తనకు క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అంటే తనకెంతో గౌరవమనీ, ఆయన గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదనీ అన్నారు. ఈ దశలో కాంగ్రెస్కు చెందిన సత్యవ్రత్ చతుర్వేది జోక్యం చేసుకుని, రికార్డులు పరిశీలించాక తన నిర్ణయం చెపుతాననీ కురియన్ గురువారం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఇరుకున పడిన కురియన్మంత్రి వెంకయ్యనాయుడు సభ వెలుపల అన్నదానికి తానేమీ చేయలేనన్నారు.
తనకేమీ అర్థం కావడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా వెంకయ్యనాయుడు సభలో మాట్లాడితే దాన్ని రికార్డుల నుంచి నేను తొలగించగలనని, వీహెచ్ ఆ విషయాన్ని సభ బయటే తేల్చుకోవాలని కురియన్ వ్యాఖ్యానించారు. కాగా, మత మార్పిడులకు పాల్పడుతున్న వారిని, కేంద్రంలో నరేంద్ర మోదీని అడ్డుకోవాలంటే దేశవ్యాప్తంగా ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు ఏకం కావాలని వీహెచ్ అభిప్రాయ పడ్డారు.
శుక్రవారం ఆయన నివాసంలో జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ పునియా, ఏఐసీసీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖుర్షీద్ అహ్మద్ సయ్యద్, బీసీ, ఎస్సీ కమిషన్ల మాజీ సభ్యులు భేటీ అయ్యారు. దేశంలో మత మార్పిడులను అడ్డుకోవడంపై వారు చర్చించారు.