విక్కీ సంచలనం: విదేశీ వేశ్యలతో వరుణ్ గాంధీ
న్యూఢిల్లీ: విదేశీ వేశ్యలతో (ఎస్కార్ట్) బిజెపి పార్లమెంటు సభ్యుడు వరుణ్గాంధీ సన్నిహితంగా ఉన్న ఫొటోలను తాను కొన్ని ఏళ్ల కిందటే చూశానని, అవి కొత్తవేమీ కావని వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ స్నేహితుడు విక్కీ చౌదరి చెప్పారు. దీంతో వరుణ్ గాంధీ మరింతగా చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు.
మెయిల్ టుడే తో శుక్రవారం ఆయన మాట్లాడారు. అభిషేక్ వర్మతో కలిసి తాను ఆయుధ వ్యాపారుల పార్టీలకు హాజరయ్యానని, అందులో కొందరి వద్ద విదేశీ వేశ్యలతో ఉన్న వరుణ్గాంధీ ఫొటోలు చూశానని చెప్పారు.
ప్రధాని నరేంద్రమోడీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్, జాతీ య భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ మాజీ వ్యాపార భాగస్వామి సీ ఎడ్మండ్స్ అల్లెన్ అని, 2016 సెప్టెంబర్ 16వ తేదీతో రాసిన లేఖల్లో వరుణ్గాంధీ తరుచూ ఆయుధ వ్యాపారులు ఏర్పాటుచేసే పార్టీలకు హాజరయ్యేవాడని, విదేశీ భామలతో సరసాలాడేవాడని తెలిపారు.
ఏడు పేజీల లేఖలో పార్లమెంట్ సభ్యుడిగా, రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా రక్షణ శాఖ రహస్యాలను తెలుసుకొని, వర్మ కు అందించేవారని, విదేశీ భామల మోజులో జాతీయ భద్రత విషయంలో రాజీ పడ్డారని ఆయన అన్నారు. ఆ లేఖల్లో వాయుసేన, నౌకాదళంలో పనిచేసిన టాప్ కమాండర్లు సైతం వర్మకు అత్యంత కీలకమైన విషయాలను లీక్ చేశారని చెప్పారు.
అందులో ఒకరు 2005లో నేవీ వార్ రూమ్ లీకేజీలో సహ నిందితుడు అని తెలిపారు. వార్ రూమ్ రహస్యాల లీక్ కేసులో వర్మ నిందితుడు అని తెలిసినా అతడికి 2011 వరకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన విషయాలు తెలిశాయని ఆరోపించారు.
ఈ విషయంపై వరుణ్ గాంధీ స్పందించారు. అభిషేక్ వర్మ తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా పనిచేశారని, అలా తనకు వర్మతో పరిచయం ఉన్నదని తెలిపారు. వర్మ పెళ్లికి కూడా తాను హాజరయ్యానని, ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాక కలవలేదనిస్పష్టం చేశారు. తనపై బురదజల్లేవారిని వదిలిపెట్టే సమస్యే లేదని, వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.