వ్యాపం స్కాం: సుప్రీం కోర్టు ఓకే, కానిస్టేబుల్ మృతి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ను కుదిపేసి, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కాం పై సుప్రీం కోర్టు స్పందించింది. పలువురు సమర్పించిన పిటీషన్లు విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ నెల 9వ తేదిన అన్ని పిటీషన్లు కలిపి విచారణ చేస్తామని తెలిపింది.
మధ్యప్రదేశ్ లో వ్యాపం స్కాం కుంభకోణం సంచలనం రేపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న నిందితులు, సాక్షులు వరుసగా అనుమానాస్పదస్థితిలో మరణిస్తున్నారు. ఈ కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అంతే కాకుండ వ్యాపం స్కాం కేసు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరిపించాలని పలువురు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటీషన్లు పరిశీలించిన సుప్రీం కోర్టు విచారణ చేపట్టడానికి సిద్దం కావడంతో వ్యాపం స్కాం నిందితులకు దడ పుడుతున్నది.
కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి......!
వ్యాపం స్కాం కుంబకోణం కేసుకు సంబంధించి మరొ అనుమానాస్పద మృతి కేసు వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ లోని తికమ్ ఘర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ రమాకాంత్ పాండే అనుమానాస్పద స్థతిలో మరణించాడు.
ఇతను నివాసం ఉంటున్న ఇంటిలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించాడు. వ్యాపం స్కాం కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ టీఎఫ్ అధికారులు రమాకాంత్ పాండే ని విచారణ చేసి వివరాలు సేకరించారు. ఈ కేసులో ఒత్తిడి తట్టుకొలేక రమాకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా, మరేమైన కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.
గత మూడు రోజుల నుండి వ్యాపం కుంభకోణానికి సంబంధించి వరుసగా మృతి చెందుతున్నారు. జర్నలిస్ట్ అక్షయ్ సింగ్, జబల్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ డాక్టర్ అరుణ్ శర్మ, ట్రైనీ ఎస్ఐ అనామికా కుష్వాహా మరణించారు. ఇప్పుడు కానిస్టేబుల్ రమాకాంత్ పాండే మరణించాడు.