మంత్రినైనా భయంగానే ఉంది: ఉమాభారతి
న్యూఢిల్లీ: వ్యాపమ్ కుంభకోణంకు సంబంధించిన మరణాలతో మధ్యప్రదేశ్ అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, తాను మంత్రినే అయినప్పటికీ తనకూ భయంగానే ఉందని కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు.
తనకు సంబంధించినవారి ప్రాణాల గురించి తాను భయపడుతున్నట్లు ఆమె తెలిపారు. తన భయాల గురించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు చెబుతాను అని చెప్పారు. ఈ కేసులో సిబిఐ విచారణ జరిపించాలని అడిగిన మొదటి వ్యక్తిని తానేనని అన్నారు.
అలాంటిది ఒక నిందితుడు చెప్పిన మాటల ఆధారంగా ఎఫ్ఐఆర్లో తన పేరును చేర్యడం అన్యాయమని అన్నారు. తన పేరును దీంట్లోకి లాగడం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని చెప్పారు.
కాగా, 2012 నుంచి ఇప్పటివరకు వ్యాపమ్ కుంభకోణంలో మొత్తం 36 మంది మరణించారు. ఈ మరణాల్లో 10మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా, మరో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గత శనివారం నుంచి సోమవారం వరకు నలుగురు మృతి చెందారు.
ఈ స్కాంతో అవమానంగా భావించిన కొందరు, భయంతో మరికొందరు తమ ప్రాణాలను విడిచారని మంత్రి ఉమాభారతి అభిప్రాయపడ్డారు. తన పేరు కుంభకోణంలో చేర్చారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని, చనిపోతానని కూడా అనుకున్నాని చెప్పారు. తన అంతర శక్తే తనను కాపాడిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్లలో రాజకీయనాయకులు, అధికారులు అవినీతికి పాల్పడి ఉద్యోగాలను అనర్హులకు కేటాయించిన ఉదంతాన్నే వ్యాపమ్ కుంభకోణంగా పేర్కొంటున్నారు.