దిగొచ్చిన చౌహాన్: సిబిఐ చేతికి వ్యాపం స్కామ్
న్యూఢిల్లీ: వ్యాపం కుంభకోణం కేసుపై ప్రతిపక్షాల ఒత్తిడికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగి వచ్చారు. వ్యాపం కుంభకోణం కేసును సిబిఐకి అప్పగించాలని ఆయన రాష్ట్ర హైకోర్టుకు సిఫార్సు చేశారు. ఈ మేరకు హైకోర్టుకు లేఖ రాస్తానని ఆయన ఇంతకు ముందే చెప్పారు.
సుప్రీంకోర్టు విచారణకు ఆ విషయం వస్తుందని, తాము కూడా సిబిఐ దర్యాప్తునకు విజ్ఞప్తి చేస్తామని ఆయన చెప్పారు. భోపాల్లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. వ్యాపం కుంభకోణంపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని కోరుతూ కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్ సింగ్, తదితరులు దాఖలు చేసిన పిటిషిన్లపై విచారణ చేయడానికి సుప్రీంకోర్టు అంతకు ముందు అంగీకరించింది.
వ్యాపం కుంభకోణం రోజు రోజుకూ సంక్లిష్టంగా మారుతోంది. మృత్యుహేళ కొనసాగుతున్న నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహన్పై విమర్శల జడివాన కురుస్తోంది. సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లినవారిలో ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు ఉన్నారు.
వ్యాపమ్ కుంభకోణం ఇప్పుడు మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. మధ్యప్రదేశ్లోని వ్యాపం స్కాంలో మరణించినంత మంది ఎక్కడా చనిపోలేదని గణాంకాలు చెప్తున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న 35 మంది అంతుబట్టని రీతిలో మరణించారు. కిల్లర్ స్కాంగా మారిన ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నది.