ఇక చెక్కుల రూపంలో వేతనాలు... చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఇకపై తమ ఉద్యోగులకు వేతనాలను చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన చట్టం అమలులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఇకపై తమ ఉద్యోగులకు వేతనాలను చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన చట్టం అమలులోకి వచ్చింది.
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఈ నూతన విధానానికి ఉద్దేశించిన వేతన చెల్లింపు (సవరణ) చట్టం-2017కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. వేతనాల చెల్లింపుల్లో నగదు రహిత విధానాలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలకు నిర్దేశించేందుకు ఈ చట్టం దోహదపడుతుంది.
అంతకుముందు బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం తొలుత డిసెంబర్ 28న దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది.
అనంతరం ఫిబ్రవరి 7న లోక్ సభ, ఆ తరువాతి రోజు రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ చట్టం ద్వారా ఇకపై ఆయా సంస్థలు చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వేతన చెల్లింపుల చట్టం-1936కు కూడా అవసరమైన మార్పులు చేశారు.